
హైదరాబాద్: "ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్ చేయవచ్చు కదా" అంటూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ను అసభ్య పదజాలంతో దూషించిన అభిమాని తన తప్పుని తెలుసుకుని క్షమాపణ చెప్పాడు. తాను చేసిన పని పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
"పాక్ కెప్టెన్ పట్ల నేను ప్రవర్తించిన తీరుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనతో బాధపడ్డ ప్రతి ఒక్కరికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేను అసలు ఆ వీడియోనే అప్లోడ్ చేయలేదు. అది ఎలా వైరల్ అయ్యిందో నాకు తెలియదు. చాలా తప్పు చేశాను. సర్ఫరాజ్తో ఉన్న చిన్నారి తన కొడుకని తెలియదు" అంటూ క్షమాపణ కోరాడు.
అసలేం జరిగింది?
శనివారం కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ లండన్లోని వెస్ట్ఫీల్డ్లోని షాపింగ్ సెంటర్కు షాపింగ్కు వెళ్లాడు. ఈ సమయంలో సర్ఫరాజ్ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్ సైతం అంగీకరించాడు. అదే సమయంలో సర్ఫరాజ్ కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు.
దీంతో ఆ అభిమాని "సర్ఫరాజ్ బాయ్.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్ చేయవచ్చు కదా" అంటూ ఘోరంగా అవమానపరిచాడు. సర్ఫరాజ్ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సర్ఫరాజ్ పట్ల ఆ అభిమాని చర్యను నెటిజన్లు తప్పుబట్టారు.
"నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్కు నేర్పించింది" అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... "నీవు చేసే 9-5 ఉద్యోగంలో ఏదో తప్పిదం చేస్తే.. అప్పుడు జనాలంతా రోడ్లపై నిన్ను ఇలానే అవమానపరిస్తే తట్టుకుంటావా?" అని మరొక నెటిజన్ ప్రశ్నించాడు.