సరిగ్గా 15 రోజుల క్రితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. కేవలం రెండు పాయింట్లతో, -0.1.05 నెగటివ్ రన్రేటుతో పదో స్థానంలో ఉంది. కానీ రెండు వారాల్లో ఎవరూ ఊహించని మార్పు. జైత్రయాత్ర కొనసాగించింది. వరుస విజయాలతో హోరెత్తించింది. ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది.
చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 27 పరుగుల తేడాతో నెగ్గి టాప్-4లో నిలిచింది. సీఎస్కేపై ఆర్సీబీ ఛాంపియన్లా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 218 పరుగులు చేసింది. అయితే తొలి మూడు ఓవర్లకు ఆర్సీబీ 31/0తో ఉన్నప్పుడు వర్షం పడటంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది.

కాసేపటి తర్వాత ఆటను తిరిగి ప్రారంభించారు. కానీ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది. కొన్ని ఓవర్ల పాటు ఊహించని విధంగా టర్న్ అవుతూ, బౌన్స్ అయ్యింది. రాంచీ టెస్టులో అయిదో రోజులా పిచ్ మారిపోయిందని మ్యాచ్ అనంతరం డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ కూడా పేర్కొన్నారు. అయితే ఈ ప్రతికూలతల మధ్య కూడా కోహ్లి, డుప్లెసిస్ పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. జట్టుకు మంచి పునాది అందించారు.
ఆ తర్వాత రజత్ పటిదార్, గ్రీన్, డీకే, మాక్సీ తలో చేయి వేసి భారీ స్కోరు అందించారు. అనంతరం బాధ్యతలు అందుకున్న బౌలర్లు తమ జట్టును గెలిపించుకున్నారు. అయితే గొప్పగా పుంజుకుని ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరిన వేళ కోహ్లి పాత వీడియో వైరల్గా మారింది.
ఆ వీడియోలో కోహ్లి ఆర్సీబీ ఉమెన్స్ జట్టుకు స్ఫూర్తినింపేలా మాట్లాడాడు. మనం గెలిచేలా ఒక్క శాతం అవకాశం ఉన్నా దాన్ని వదిలిపెట్టకూడదని, అది గెలవడానికి సరిపోతుందని అన్నాడు. ఒకటి పదిగా, పది ముప్పైగా, ముప్పై వందగా మారుతుందని చెప్పాడు. ఈ మాటలను నిజం చేస్తూ ఆర్సీబీ మాస్ కమ్ బ్యాక్ చేసిందని నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.