హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆటలో మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ (12), మొయిన్ అలీ (9) క్యాచ్లను స్లిప్లో కేఎల్ రాహుల్ అందుకున్నాడు.
ఇన్నింగ్స్ 12.1వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని ఎదుర్కొన్న కుక్(12) స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 15.4వ ఓవర్లో ఇషాంత్ శర్మ వేసిన బంతిని ఎదుర్కొన్న మొయిన్ అలీ(9) కేఎల్ రాహుల్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఈ సిరీస్లో ఇప్పటి వరకు రాహుల్ 11 క్యాచ్లు పట్టాడు.
దీంతో ఒక సిరీస్లో ఎక్కువ క్యాచ్లు అందుకున్న భారత ఫీల్డర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో రాహుల్ ద్రవిడ్ మొత్తం 13 క్యాచ్లను అందుకుని అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అతని తర్వాత 1972-73లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సోల్కర్ 12 క్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇప్పటికే 11 క్యాచ్లను అందుకున్న కేఎల్ రాహుల్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. ఈ సిరిస్లో ఇంకా ఒక టెస్టు మిగిలి ఉండటంతో రాహుల్ ద్రవిడ్ రికార్డుని బద్దులు కొట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జెన్నింగ్స్ (31), రూట్ (26) పరుగులతో ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 6/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 24 పరుగుల వద్ద ఓపెనర్ అలిస్టర్ కుక్ (12) వికెట్ కోల్పోయింది.
బుమ్రా బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చిన కుక్ పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్లో పుజారా సెంచరీ (132 నాటౌట్) చేశాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 15వ సెంచరీ.