హైదరాబాద్: టెస్టు క్రికెట్లో ఉన్న మజా ఏంటో బంగ్లా-ఆసీస్ టెస్టులో అభిమానులు చవిచూశారు. అనూహ్య మలుపులు తిరుగుతూ సాగిన ఈ టెస్టులో ఆస్ట్రేలియాపై ఆతిథ్య బంగ్లాదేశ్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయంపై ఆశలు వదులుకోకుండా పట్టుదలతో పోరాడిన వైనం నిజంగా అద్భుతం.
తద్వారా వన్డేల్లో కాదు... టెస్టుల్లో కూడా తమ జట్టుని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని బంగ్లాదేశ్ మేటి జట్లకు మరోసారి చాటి చెప్పింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (112) జోరుతో ఒకానొక దశలో గెలిచేలా కనిపించిన ఆస్ట్రేలియా జట్టు బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్ దెబ్బకు అనూహ్యంగా కుప్పకూలింది.
నాలుగు రోజు 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 109/2 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 244 పరుగులు చేసిన ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ వార్నర్ 121 బంతుల్లో సెంచరీని పూర్తిచేశాడు. టెస్టుల్లో అతనికిది 19వ సెంచరీ కాగా... మిగతా బ్యాట్స్మెన్లో పూర్తిగా విఫలమయ్యారు.

తొలి ఇన్నింగ్స్లోనూ 5 వికెట్లు తీయడమే కాక, 84 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బంగ్లాదేశ్కు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఇదే తొలి విజయం. మరోవైపు ఉపఖండంలో ఆడిన గత 13 టెస్టుల్లో ఆసీస్ 11 మ్యాచ్ల్లో ఓడింది.
కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవగా మరొకటి డ్రా చేసుకుంది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు 101 టెస్టులాడగా అందులో పదింటిలో గెలిచింది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిన ఐదో దేశం ఆస్ట్రేలియాగా నిలిచింది. బంగ్లాదేశ్ తొలిసారిగా ఆసీస్ను ఓడించిచడంతో ఆ దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి చిట్టగాంగ్లో జరగనుంది.
మ్యాచ్ అనంతరం డ్రస్సింగ్ రూమ్కి చేరుకున్న బంగ్లా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. పాటలు ఆలపిస్తూ క్రికెట్ బ్యాట్లతో దరువేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆసీస్పై విజయం సాధించిన బంగ్లా జట్టుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ నగదు నజరానాను ప్రకటించింది.