
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోహ్లీసేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. అనంతరం భారత్ నిర్దేశించిన 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నిలకడగా ఆడుతూ చేధన ఆరంభించింది.

ఇన్నింగ్స్ 28వ ఓవర్లో
ఈ క్రమంలో అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్లోని 3వ బంతిని ఎదుర్కొన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పరుగు తీస్తున్న క్రమంలో బంతిని సమీపంలో ఉన్న పాండ్యా అందుకున్నాడు. బంతిని నేరుగా వికెట్లవైపు విసిరే క్రమంలో పాండ్యా పల్టీలు కొట్టాడు. అదే సమయంలో పరుగు తీస్తున్న విలియమ్సన్.. పాండ్యాను ఢీకొట్టాడు.
పాండ్యా చిటికిన వేలుకు గాయమై రక్తం కూడా వచ్చింది
దీంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు పడ్డారు. ఈ ఘటనలో పాండ్యా ఎడమచేతి చిటికిన వేలుకు గాయమై రక్తం కూడా వచ్చింది. చిన్న గాయమే కావడంతో ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి ఆటను కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

6 పరుగుల తేడాతో భారత్ విజయం
కాగా, ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఒకానొక దశలో లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. చివర్లో తడబాటుకు గురై వరుస వికెట్లను కోల్పోయింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విలియమ్సన్ 64 పరుగులు చేశాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నవంబర్ 1న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.


Click it and Unblock the Notifications