
హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో కామెంటేటర్ విధులు నిర్వహిస్తోన్న టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్పై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు పక్షపాత ధోరణితో కామెంట్రీ చెపుతున్నాడంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. టోర్నీలో భాగంగా మంగళవారం ఇండియా-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహారించిన సంజయ్ మంజ్రేకర్ భారత ఇన్నింగ్స్లో టీమిండియా వికెట్ కీపర్ ధోనీ బ్యాటింగ్ శైలిపై విమర్శించాడు. చివరి ఓవర్లలో ధోనీ నెమ్మదిగా ఆడుతున్నాడని ఒకానొక సందర్భంలో అన్నాడు. బంగ్లాతో మ్యాచ్ అనంతరం ధోని ఆటతీరుపై సంజయ్ మంజ్రేకర్ ట్విట్టర్లో సైతం తీవ్ర విమర్శ చేశాడు.
"ధోనీ గురించి ఆసక్తికరమైన విషయం. ఈ ప్రపంచకప్లో ధోనీ స్పిన్నర్లు వేసిన 87 బంతులను ఎదుర్కొని 41 పరుగులు మాత్రమే చేశాడు. వార్మప్ మ్యాచ్ల్లో మాత్రం స్పిన్నర్లు వేసిన 56 బంతులు ఎదుర్కొని 69 పరుగులు చేశాడు. దీనిని బట్టి ధోని మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నాడనిపిస్తోంది. పెద్ద మ్యాచ్ల్లో ధోనీ సరైన రీతిలో ఆడలేకపోతున్నాడు" అని ట్వీట్ చేశాడు.
మంజ్రేకర్ చేసిన ఈ ట్వీట్పై సోషల్ మీడియాలో ధోని అభిమానులు మండిపడుతున్నారు. సంజయ్ మంజ్రేకర్ పక్షపాత ధోరణితో కామెంట్రీ చేస్తున్నాడని, ఇకపై టీవీలను మ్యూట్లో పెట్టి మ్యాచ్లు చూస్తామంటూ ట్వీట్లు చేశారు. మరికొందరైతే సంజయ్ను కామెంట్రీ నుంచి తొలగించాలని స్టార్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.