
హైదరాబాద్: మ్యాచ్ జరుగుతోన్న సమయంలో క్రికెట్ మైదానంలోకి భద్రతా సిబ్బందిని దాటి వచ్చి అభిమాన క్రికెటర్ పాదాలు తాకడం ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం. తాజాగా ఇలాంటి అనుభవమే భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ ఎదుర్కొన్నాడు. తాజాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు రోజుల పాటు కర్ణాటక చలన చిత్ర కప్(కేసీసీ) టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొనగా సినీ నటులు, మాజీ క్రికెటర్లతో పాటు కర్ణాటకకు చెందిన క్రికెటర్లు పాల్గొన్నారు. నటుడు సుదీప్ నాయకత్వం వహించిన కదంబ లయన్స్ జట్టులో సెహ్వాగ్ సభ్యుడు. టోర్నీలో భాగంగా ఈగల్స్ జట్టుతో తలపడుతోన్న సమయంలో సెహ్వాగ్ మైదానంలో ఫీల్డింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంతలో గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తోన్న ఓ అభిమాని భద్రతా సిబ్బందిని దాటి నేరుగా మైదానంలోకి వచ్చి సెహ్వాగ్ పాదాలను తాకుతూ తన అభిమానాన్ని చాటాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదే మ్యాచ్లో సెహ్వాగ్ ఓ భారీ సిక్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్గా దిగిన సెహ్వాగ్ తొలి ఓవర్లోనే ఫోర్, సిక్స్, ఫోర్ కొట్టాడు. అంతేకాదు, తాను సిక్స్ కొట్టిన వీడియోను సెహ్వాగ్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు ఎంతో సరదాగా బ్యాటింగ్ చేశాను" అని కామెంట్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
2013లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సెహ్వాగ్ ట్విటర్ ద్వారా నిత్యం అభిమానులకు టచ్లోనే ఉంటోన్న సంగతి తెలిసిందే. భారత్ జట్టులో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో సెహ్వాగ్ ఒకడు. భారత తరుపున 104 టెస్టులు, 251 వన్డేలాడిన సెహ్వాగ్ అన్ని ఫార్మాట్లలో కలిపి 16,859 పరుగులు చేశాడు.