
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 30 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెర దించింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడించడం 1992 తరువాత ఇదే తొలిసారి. శ్రీలంక బౌలింగ్, ఫీల్డింగ్ ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ను కోల్పోయింది. శ్రీలంక నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. నాలుగు పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.
కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 258 పరుగులు చేసింది. చరిత్ అసలంక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 106 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్లతో 110 పరుగులను చేశాడు. ఇది అతని తొలి సెంచరీ. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ దిగిన అసలంక.. బ్యాటింగ్ బ్యాక్బోన్గా నిలిచాడు. మరో ఎండ్లో ధనంజయ కూడా క్రీజ్లో పాతుకుపోయాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లతో 60 పరుగులు చేశాడు.
259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్ సైతం తడబడింది. కేప్టెన కమ్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ డకౌట్ అయ్యాడు. మిఛెల్ మార్ష్-26, మార్నుస్ లాంబుషెన్-14, అలెక్స్ క్యారీ-19, ట్రవిస్ హెడ్-27, గ్లెన్ మ్యాక్స్వెల్-1, కామెరాన్ గ్రీన్-13, మాథ్యూ కుహ్నెమన్-15 చేశారు. చివర్లో పాట్ కమ్మిన్స్ 35 పరుగులు చేయడం వల్ల ఆస్ట్రేలియా లక్ష్యానికి చేరువగా వెళ్లగలిగింది గానీ దాన్ని అందుకోవడంతో విఫలమైంది.
ఆసీస్ ఇన్నింగ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్కడే భారీ స్కోర్ చేశాడు. 112 బంతుల్లో 12 ఫోర్లతో 99 పరుగులు చేశాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ అయ్యాడు. 99 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 38వ ఓవర్ రెండో బంతిని డేవిడ్ వార్నర్ క్రీజ్ నుంచి బయటికి వచ్చి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతిని అందుకోలేకపోయాడు. అది కాస్తా వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా చేతుల్లో వాలడం, మెరుపు వేగంతో అతను బెయిల్స్ను ఎగరగొట్టడం క్షణాల్లో జరిగిపోయింది.
శ్రీలంకకు ఇది కీలకమైన వికెట్. సెంచరీ పూర్తి చేసుకుని ఉంటే డేవిడ్ వార్నర్.. లంక బౌలర్లకు చుక్కలు చూపించేవాడే. సరైన సమయంలో కీలక వికెట్ను పడగొట్టడంతోనే శ్రీలంక గెలుపు ఖాయమైంది. వార్నర్ అవుట్ అయిన తరువాత కామెరాన్ గ్రీన్, పాట్ కమ్మిన్స్, మాథ్యూ కుహ్నెమన్ భారీ స్కోర్ చేయలేకపోయారు. ఫలితంగా 254 పరుగుల వద్దే ఆస్ట్రేలియా ప్రయాణం ఆగింది.