
హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ఆరంభానికి ముందే చెన్నై అభిమానులకు పండుగ వచ్చింది. రెండేళ్ల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో తిరిగి అడుగు పెడుతుడటంతోపాటు.. ఆ జట్టుకు మళ్లీ ధోనీనే కెప్టెన్గా ఎంపికవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
గురువారం రాత్రి తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను ఫ్రాంచైజీలు ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. చెన్నై ప్రాంఛైజీ ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు అయిన ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జాడేజాలను తన వద్దే అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ఆటగాళ్లు కాంట్రాక్ట్ పేపర్ల మీద సంతకాలు చేస్తున్న వీడియోను చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో పంచుకుంది. ధోనీని అట్టిపెట్టుకునే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ... సురేశ్ రైనా, జడేజా విషయంలో తొలుత అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అలాంటి అనుమానాలకు తావివ్వంకుండా ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లను తమతోపాటే ఉంచుకుంది. రెండేళ్ల విరామం తర్వాత చెన్నై జట్టు తరఫున బరిలో దిగబోతున్న సురేశ్ రైనా ఉద్వేగానికి లోనయ్యాడు. 'వణక్కం చెన్నై. రెండు సంవత్సరాల తర్వాత నా జనం ముందు ఆడబోతున్నాను. గత రెండేళ్లుగా మిమ్మల్ని మిస్సయ్యాను. చెపాక్లో చూస్తాను' అంటూ ట్విటర్లో వీడియో పోస్ట్ చేశాడు.
ఇక, రవీంద్ర జడేజా సైతం 'నేను సీఎస్కేలో మళ్లీ భాగమైనందుకు చాలా ఉత్సహంగా, సంతోషంగా ఉన్నాను. మా ఆటను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. మేం చాలా మ్యాచ్లు గెలవడానికి ప్రయత్నిస్తాం. విజిల్ పొడు' అన్న వీడియోని చెన్నై జట్టు ట్విట్టర్లో పోస్టు చేసింది.