ముంబై: బ్రాబోర్న్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్లో ధోని బ్యాటింగ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తన కెరీర్లోనే కెప్టెన్గా ఆఖరి మ్యాచ్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు.
ధోని క్రీజులోకి వస్తున్న సమయంలో అభిమానులు నిల్చుని మరీ ధోనికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధోని ధోని అంటూ పెద్ద ఎత్తున అరుపులు కేకలతో నినాదాలు చేశారు. కెప్టెన్గా ధోనికి ఇది ఆఖరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్కు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు.
ఈ మ్యాచ్లో ధోని 40 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 68 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ధోని సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీంతో భారత ఏ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను నష్టపోయి 304 పరుగులు చేసింది.
దీంతో ఇంగ్లాండ్ లక్ష్యం 305 పరుగులుగా నిర్దేశించింది. ఈ మ్యాచ్లో తెలుగు తేజం అంబటి రాయుడు సెంచరీ నమోదు చేసిన ధోని క్రీజులోకి వచ్చాడు. ఈ సమయంలో ధోనికి స్టేడియంలోని అభిమానులంతా లేచి నిల్చుని సాదర స్వాగతం పలికారు. 40.1 ఓవర్ల వద్ద క్రీజులోకి వచ్చి ధోని యువీతో జతకలిశాడు.
అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగిన ధోని 8 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో అర్ధసెంచరీని నమోదు చేశాడు. మరోవైపు ధోని గౌరవార్ధం ఈ మ్యాచ్కు హాజరయ్యే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్లను ఇచ్చింది.