

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం సూపర్-4లో భారత్-అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగియడంతో అఫ్ఘన్ శిబిరంలో ఆనందం వెల్లివెరియగా, భారత అభిమానుల్లో నిరాశకు గురయ్యారు.
మ్యాచ్ అనంతరం ఈ విషయాలేవీ పట్టించుకోకుండా మ్యాచ్ను ప్రసారం చేస్తున్న కెమెరాలన్నీ కొద్దిసేపు ఓ బుడతడిపై దృష్టి సారించాయి. ఫలితం తేలకుండా మ్యాచ్ ముగియడంతో భారత్కు వీరాభిమాని అయిన ఆ చిన్నోడికి దుఃఖం ఆగలేదు. అతడిని ఓదార్చేందుకు అతని తండ్రి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
వెంటనే విషయం తెలుసుకున్న ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, మరికొందరు ఆటగాళ్లు అతడివద్దకు వెళ్లి బుజ్జగించడంతో దారికొచ్చాడు. అదే సమయంలో భారత పేసర్ భువీ కూడా ఫోన్లో పలకరించాడు. తన కుమారుడిని అనునయించిన క్రికెటర్లకు తండ్రి అమర్ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపి శుక్రవారంనాటి ఫైనల్ను ఆనందంగా తిలకిస్తామని చెప్పాడు.