హైదరాబాద్: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఓ పక్క, క్రికెట్ దిగ్గజం, గాడ్ ఆఫ్ క్రికెట్ మరో పక్క.. వీరిద్దరినీ పోలుస్తూ ఎవరు గొప్ప అనే ప్రశ్నను ప్రముఖ సోషల్ మీడియా ఫేస్బుక్ నిర్వహించింది. ఈ సర్వేను ఇక్కడ ఇండియా నుంచి కాదు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్వహించింది. ఇక్కడైతే ఎలాగూ సచిన్ టెండూల్కర్ అనే సమధానం వస్తుంది. కానీ, అక్కడ దానికి విరుద్ధంగా బదులొచ్చింది.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్వహించిన ఓ ఆన్లైన్ పోల్లో కోహ్లీనే గొప్ప అని చెప్పారు. మంగళవారం (ఏప్రిల్ 24న) సచిన్ టెండూల్కర్ 45వ పుట్టిన రోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఫేస్బుక్ పేజ్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. 'సచిన్ టెండూల్కర్ -విరాట్ కోహ్లీ... ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప' అని ప్రశ్నించింది. కొద్ది సేపటి తర్వాత ఆ సర్వే తాలూకా ఫలితాలను వెల్లడించింది.
దాంతో పాటు సర్వే వీడియో కూడా పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆసీస్ ఆటగాళ్లు పీటర్ హ్యాండ్స్కాంబ్, హేజిల్వుడ్, మిచెల్ స్వీప్సన్, రెన్షా, స్టీవ్ ఓకెఫీ వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో ముగ్గురు ఆటగాళ్లు హ్యాండ్స్కాంబ్, మిచెల్ స్వీప్సన్, ఓకెఫీ.. కోహ్లీనే గొప్ప అని బదులిచ్చారు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ పుట్టిన రోజు నాడు ఇలాంటి సర్వేలు నిర్వహించడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్వేకు ముందు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ఆ దేశ ఆటగాడు ఫ్లెమింగ్ పుట్టిన రోజు సందర్భంగా సచిన్ వికెట్ తీసిన వీడియోను పోస్టు చేయడంపైనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.