
హైదరాబాద్: ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ అయిన షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో క్రికెట్ అభిమానుల మెదడకు పదునుపెట్టే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం విక్టోరియా-క్విన్స్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో క్విన్స్లాండ్ లెగ్ స్పిన్నర్ వేసిన బంతి ఔట్ సైడ్ పిచ్పై పడి కీపర్ చేతిలోకి వెళ్లింది.
ఇది నోబాల్ అని మైదానంలోని ఆటగాళ్లంతా భావించారు. కానీ, ఫీల్డ్ అంపైర్ మాత్రం దానిని సరైన బంతిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సాధారణంగా కొంత క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే దానిని ఖచ్చితంగా నోబాల్ అని చెబుతారు. కానీ, ఫీల్డ్ అంపైర్ తీరుపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
అంపైర్ నిర్ణయంతో వికెట్ కీపర్ సైతం అవాక్కయ్యాడు. మ్యాచ్ కామెంటేటర్లు అయితే అది ఖచ్చితంగా నోబాల్ అని, బంతి ఏమాత్రం పిచ్ మీద పడలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చెత్త అంఫైరింగ్కు ఇది మరో నిదర్శమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో విక్టోరియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.