
సౌథాంప్టన్: టీమిండియా సహా భారత క్రికెట్ అభిమానుల్లో కలకలం పుట్టించిన గాయాల బెడద నుంచి ఆల్రౌండర్ విజయ్ శంకర్ కాస్త త్వరగానే కోలుకున్నాడు. జట్టు సభ్యులతో కలిసి నెట్ ప్రాక్టీస్లో చురుగ్గా పాల్గొన్నాడు. విజయ్ శంకర్ గాయం బారి నుంచి కోలుకున్నాడని, నెట్ ప్రాక్టీస్లో చురుగ్గా పాల్గొంటున్నాడని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయ్ శంకర్ షాట్లు ఆడటం ఈ వీడియోలో చూడొచ్చు. పాదాల కదలికల్లోనూ ఎలాంటి సమస్యలు లేవని, తాను మామూలు స్థితికి చేరుకున్నట్లు విజయ్ శంకర్ తెలిపాడు.
నెట్ ప్రాక్టీస్ సందర్భంగా విజయ్ శంకర్ గాయపడ్డ విషయం తెలిసిందే. జస్ప్రీత్ బూమ్రా వేసిన ఓ యార్కర్ నేరుగా విజయ్ శంకర్ ఎడమ పాదాన్ని తాకింది. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బంతి నేరుగా అతని మడమను తాకింది. దీనితో భరించలేని నొప్పితో విజయ్ శంకర్ విలవిల్లాడాడు. నెట్ ప్రాక్టీస్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. బంతి తగలడం వల్ల అతని మడమల్లో వాపు ఏర్పడిందని టీమ్ ఫిజియోథెరఫిస్ట్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో శనివారం సౌథాంప్టన్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్కు దూరం కావచ్చని అభిప్రాయపడ్డాడు.
కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం అతని గాయం తగ్గిందని తేలింది. జస్ప్రీత్ బూమ్రా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం విజయ్ శంకర్ సాధారణ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో- ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్లో విజయ్ శంకర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అతణ్ని జట్టులోకి తుది జట్టులోకి తీసుకుంటే.. రిషబ్ పంత్ లేదా కెఎల్ రాహుల్లల్లో ఎవరో ఒకర్ని తప్పించాల్సి ఉంటుంది.