హైదరాబాద్: క్రికెట్లో స్లెడ్జింగ్ అనేది సర్వ సాధారణం. ఒక్కో సందర్భంలో స్లెడ్జింగ్ శ్రుతి మించితే, మరొకొన్ని సందర్భాల్లో సరదాగా సరదాగా సాగుతుంది. వెస్టిండిస్లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీలో ఇద్దరు క్రికెటర్లు మధ్య జరిగిన స్లెడ్జింగ్ స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల్లో నవ్వులు తెప్పించింది.
అసలేం జరిగిందంటే.. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా జమైకా తల్హాస్-అమెజాన్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్ విలియమ్స్, బ్యాట్స్మన్ వాల్టన్పై స్లెడ్జింగ్కు దిగాడు. వాల్టన్ అవుటైన సందర్భంలో విలియమ్స్ చేతిలో ఏదో రాస్తూ ఇది గుర్తు పెట్టుకో అంటూ స్లెడ్జింగ్ చేశాడు.
ఆ తర్వాత మళ్లీ ఇరు జట్లు తలపడిన తదుపరి మ్యాచ్లో విలియమ్స్ బౌలింగ్లో వాల్టన్ రెచ్చిపోయి ఫోర్లు మోత మ్రోగించాడు. విలియమ్స్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్ని బౌండరీలు దాటించాడు. ఇలా బంతిని ఫోర్ బాదిన ప్రతిసారి బ్యాట్ పై ఏదో రాస్తూ అంతకుముందు విలియమ్స్ చేసిన స్లెడ్జింగ్కు ప్రతీకారం తీర్చుకున్నాడు.
అలా మ్యాచ్లో వాల్టన్ మొత్తం 40 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్లకు సంబంధించి ఆయా ఆటగాళ్ల మధ్య జరిగిన స్లెడ్జింగ్ వీడియాని సోషల్ మీడియాలో వైరల్ అయింది.