రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఏళ్ల ట్రోఫీ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్-2024 సీజన్ను కూడా ఆర్సీబీ టైటిల్ను అందుకోకుండానే ముగించింది. ఓ దశలో తొలి ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం ఒకే విజయం సాధించిన బెంగళూరు ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. కానీ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దీంతో 17 ఏళ్ల కప్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (34; 22 బంతుల్లో, 2x4, 2x6), విరాట్ కోహ్లి (33; 24 బంతుల్లో, 3x4, 1x6), మహిపాల్ లోమ్రర్ (32; 17 బంతుల్లో, 2x4, 2x6) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/44) మూడు, అశ్విన్ (2/19) రెండు వికెట్లు తీశారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (45; 30 బంతుల్లో, 8x4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో, 2x4, 2x6), హెట్మెయిర్ (26; 14 బంతుల్లో, 3x4, 1x6) విజయంలో కీలక పాత్ర పోషించారు. సిరాజ్ (2/33) రెండు వికెట్లు తీశాడు.
అయితే బెంగళూరు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆర్సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీటిని ఆపుకుంటూ బాధపడ్డాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, వచ్చే సీజన్లో ఆర్సీబీ మరింత బలంగా తిరిగొచ్చి టైటిల్ను సాధిస్తుందని ఆశిస్తూ డివిలియర్స్ ట్వీట్ చేశాడు.
''ఓటమి ఎప్పుడూ బాధాకరమే. కానీ మే ప్రారంభంలో ఆశలు లేని స్థితి నుంచి ఆర్సీబీ గొప్పగా పోరాడింది. ఆర్సీబీ అభిమానిగా ఈ అసాధారణ పోరాటాన్ని చూసి గర్వపడుతున్నా. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగొచ్చి టైటిల్ను గెలుస్తుందని కచ్చితంగా అనుకుంటున్నా'' అని డివిలియర్స్ ట్వీట్ చేశాడు.