
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు తడబడుతోంది. వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో మిడిలార్డర్ పోరాటంతో గెలిచిన జట్టు.. రెండో వన్డేలో పూర్తిగా చేతులెత్తేసింది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ వేసే బంతులను ఎదుర్కోవడంలో టీమిండియా టాపార్డర్ ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో అతను తొలి బంతికే పెవిలియన్ చేరాడు.
ఇదే విషయాన్ని గుర్తుచేసిన మాజీ లెజెండ్ వసీం జాఫర్.. ఆసక్తికర సలహా ఇచ్చాడు. సూర్య ఇలా విఫలం అవుతున్నప్పుడు మూడో వన్డేలో సంజూకు ఛాన్స్ ఇవ్వాలని అతను సూచించాడు. సంజూ కూడా మంచి బ్యాటర్ అని, అలాగే అతనికి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని మెచ్చుకున్నాడు. 'తను ఎదుర్కొనే తొలి బంతే 145 కిలోమీటర్ల వేగంతో వస్తుందని, అది కూడా స్వింగ్ అవుతుందని ఎవరూ ఊహించరు. ఈ విషయంలో సూర్యను మనం అంతా అర్థం చేసుకోవచ్చు. కానీ అవతల బౌలింగ్ వేస్తోంది స్టార్క్ అయినప్పుడు.. అది జరిగే అవకాశం ఎక్కువ అని సూర్య కూడా అర్థం చేసుకోవాల్సింది' అని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
స్టార్క్ ఎప్పుడూ స్టంప్స్ను ఎటాక్ చేస్తాడని, కుదిరితే స్వింగ్ చేస్తాడని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని స్టార్క్ కూడా రెండో వన్డే తర్వాత చెప్పాడు. తను 13 ఏళ్లుగా ఇదే పద్ధతిలో బౌలింగ్ చేస్తున్నానని అన్నాడు. జాఫర్ కూడా ఇదే చెప్పాడు. అలాగే మూడో వన్డేలో కూడా సూర్యకే టీం మేనేజ్మెంట్ ఛాన్స్ ఇస్తుందేమో చూడాలన్నాడు. 'మూడో వన్డేలో సూర్యనే కొనసాగిస్తారేమో చూడాలి. లేదంటే సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వాలి. తనకు వచ్చిన అవకాశాల్లో సంజూ బాగానే ఆడాడు. అతను మంచి ప్లేయర్ కూడా' అని జాఫర్ చెప్పాడు. ఇప్పటి వరకు 11 వన్డేలు ఆడిన సంజూ 66 సగటుతో 330 పరుగులు చేశాడు. సూర్య స్థానంలో నాలుగో ప్లేస్లో అతను చక్కగా సరిపోతాడని చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డారు.