కెప్టెన్గా వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ శర్మపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కూడా ప్రశంసలు కురిపించాడు. టెస్టు ఫార్మాట్లో విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్గా నిలుస్తాడని ఆయన జోస్యం చెప్పాడు. రోహిత్ శర్మ ఇంకా ఎన్ని మ్యాచ్లకు కెప్టెన్సీ చేస్తాడో తెలియనప్పటికీ మేటీ కెప్టెన్లలో ఒక్కడిగా కచ్చితంగా ఉంటాడని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ఇటీవల సాధించిన వరుస విజయాలే దీనికి నిదర్శనంగా జాఫర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా వరుస సిరీస్లను వైట్ వాష్ చేస్తోందని ఆయన గుర్తు చేశాడు. ఈ విధంగా చూస్తే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు సరైన వ్యక్తి చేతుల్లోకే వెళ్లాయనిపిస్తోందని వసీం జాఫర్ అన్నాడు.
కాగా రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక భారత జట్టు వరుసగా 14 మ్యాచ్ల్లో గెలిచింది. హిట్మ్యాన్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం. అలాగే ప్రతి సిరీస్ను వైట్ వాష్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేసిన తొలి సిరీస్లో టీమిండియా న్యూజిలాండ్తో తలపడింది. కివీస్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడగా టీమిండియా అన్ని గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది.
ఆ తర్వాత వెస్టిండీస్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు క్లీన్స్వీప్ చేసింది. ఇక తాజాగా శ్రీలంకతో ముగిసిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను, 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను సైతం టీమిండియా వైట్వాష్ చేసి సత్తా చాటింది.
ఇక ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్ కోసం సిద్దమవుతున్నారు. ఐపీఎల్ 12 ఎడిషన్ ఈ నెల 26 నుంచే ప్రారంభం కానుంది. ఈ సారి ఏకంగా 10 జట్లు టోర్నీలో పోటీపడుతున్నాయి. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో టోర్నీ ముగియనుంది. ప్లేఆఫ్ మ్యాచ్లతో కలిపి లీగ్లో మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో లీగ్ స్టేజ్లోనే 70 మ్యాచ్లు జరగనున్నాయి.