
న్యూఢిల్లీ: టీమిండియా తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్ ఔట్ అవుతున్న తీరు కాస్త ఆందోళనకు గురి చేస్తుందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. రిషభ్ పంత్ బౌలర్ల ట్రాప్లో పడుతున్నాడని తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్లో పంత్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు సార్లు ఆఫ్-స్టంప్ వెలుపల వేసిన బంతులకే పంత్ వికెట్ సమర్పించుకున్నాడు.
2022లో పంత్ 16 సార్లు ఔట్ అవ్వగా.. అందులో 10 సార్లు వైడ్ ఆఫ్ స్టంప్ బంతులకే ఔట్ కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో కూడా పంత్ అదే రీతిలో పెవిలియన్కు చేరాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన వసీం జాఫర్.. పంత్ను ఔట్ చేయడానికి బౌలర్లకు ఇది ఓ అస్త్రంగా మారిందన్నాడు. 'అతను వరుసగా అన్ని మ్యాచ్ల్లో ఒకే విధంగా వికెట్ను కోల్పోతున్నాడు. బౌలర్లు అతనికి ఔట్ సైడ్ ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తున్నారు.
అతను ప్రతీ మ్యాచ్లోను బౌలర్ల ట్రాప్లో పడుతున్నాడు. అతను రానున్న మ్యాచ్ల్లో అతని బ్యాటింగ్ టెక్నిక్ను మార్చుకోవాలి" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో టీ20లో టీమిండియా సౌతాఫ్రికాపై 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-2తో సమంగా నిలిచింది.
మొదట టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దినేశ్ కార్తీక్ ( 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 55) ధనాధన్ ఇన్నింగ్స్తో అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధశతకాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్య ( 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 46) బాదుడు కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఎంగిడి (2/20) రాణించాడు. ఈ మ్యాచ్తో జాన్సన్ (1/38) అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. అవేశ్ ఖాన్ (4/18) ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. చాహల్ (2/21) కూడా మెరిశాడు.