
ఒక్క అవకాశం కూడా రాలేదు:
తాజాగా వసీమ్ జాఫర్ క్రిక్ట్రాకర్తో మాట్లాడుతూ... 'ఓ సిరీస్ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం జరిగింది. దాంతో కొంతకాలం టెస్ట్ సిరీస్ లేకుండా పోయింది. అప్పుడు చాలా మార్పులు జరిగాయి. నేను కూడా బాగా ఆడలేదు. దేశవాళీ క్రికెట్లో పరుగులు చేసి 2002లో తిరిగి జట్టులోకి వచ్చా. 2005 నుండి 2008 వరకు నేను బాగానే ఆడాను. జట్టునుంచి తొలగించిన తరువాత ఇంకా మంచి ఆటగాడిని అయ్యా. ఎంతో మెరుగైన తర్వాత భారత జట్టులో చోటు దక్కకపోవడం నిరాశనే మిగిల్చింది. బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహనకు వచ్చి ఒక క్రికెటర్గా మరింత పరిణితి సాధించిన తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పటికీ వెలితిగానే ఉంది. ఇన్నేళ్లలో ఒక్క అవకాశం కూడా రాలేదు' అని తెలిపాడు.

కోహ్లీనే వైట్బాల్ క్రికెట్లో అత్యుత్తమం:
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మల్లో ఎవరు అత్యుత్తమ పరిమిత ఓవర్ల ఆటగాడు అనే దానిపై జాఫర్ తన అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. సచిన్, రోహిత్ల కంటే కోహ్లీనే వైట్బాల్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడన్నాడు. కోహ్లీ నమోదు చేసిన గణాంకాలు, యావరేజ్లను చూస్తే అందరూ ఇదే చెబుతారన్నాడు. తాను ఆడిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీనే అత్యుత్తమం అని పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభం తర్వాత కెప్టెన్సీ బాధ్యతల్ని తీసుకున్న దాదా.. టీమిండియాకు దూకుడు నేర్పాడన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, మొహమ్మద్ కైఫ్, ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్ వంటి స్టార్ ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్కు పరిచయం చేసిన ఘనత గంగూలీదే అని చెప్పాడు.

కొత్త ఇన్నింగ్స్:
ఫస్ట్క్లాస్ క్రికెట్ దిగ్గజం వసీమ్ జాఫర్ ఇటీవలే కొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా అతడు నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది దేశవాళీ సీజన్ కోసం సంవత్సర కాలానికి జట్టుకు కోచ్గా ఉండనున్నాడు. దీంతో అతడు మొదటిసారి కోచ్గా పనిచేయనున్నాడు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్లో కొనసాగిన జాఫర్ ఈ ఏడాది మార్చిలో ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

మార్చిలో ఆటకు వీడ్కోలు:
వసీమ్ జాఫర్ ఈ ఏడాది మార్చిలో ఆటకు వీడ్కోలు పలికాడు. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు సాధించాడు. రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడు జాఫరే కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్.. ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ జాఫర్ రికార్డు సృష్టించాడు. తన క్రికెట్ కెరీర్లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన జాఫర్.. ఆ తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గానూ జాఫర్ అరుదైన ఘనత అందుకున్నాడు. 1996-97 సీజన్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాఫర్.. మొత్తం 260 మ్యాచ్లు ఆడి 19,410 పరుగులు బాదాడు. అందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












