భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టుకు అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఈ క్రమంలో టీమిండియాలో ఆడే పదకొండు మందిలో ఎవరికి అవకాశాలు దక్కుతాయని తెగ చర్చ నడుస్తోంది. అయితే యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేస్తాడని రోహిత్ తేల్చిచెప్పాడు. దీంతో దాదాపుగా టీం ఎవరని తేలిపోయింది.
మాజీ దిగ్గజం వసీం జాఫర్ కూడా ఈ క్రమంలో ఆడే పదకొండు మంది ఎవరని అంచనా వేశాడు. అయితే తన జట్టులో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్కు జాఫర్ అవకాశం ఇవ్వలేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ను ఎంపిక చేశాడు. రిషభ్ పంత్కు గాయమైన తర్వాత కేఎస్ భరత్ ఇప్పటి వరకు 8 టెస్టు మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. కీపర్గా భరత్ ఆకట్టుకున్నా కూడా బ్యాటుతో పెద్దగా రాణించలేదు.

ఈ క్రమంలోనే అతని స్థానంలో కిషన్కు అవకాశం ఇవ్వాలని జాఫర్ భావించినట్లు కనిపిస్తోంది. అలాగే తాము ముగ్గురు పేసర్లతో బరిలో దిగుతామని రోహిత్ ఇప్పటికే చెప్పేశాడు. దీంతో తన జట్టులో మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్ను జాఫర్ సెలెక్ట్ చేశాడు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దర్నీ తీసుకున్నాడు.
ఈ మ్యాచ్లో తమ బెస్ట్ కాంబినేషన్ను గుర్తించడంలోనే రోహిత్ కష్టపడాల్సి ఉంది. ఇది కనుక అతను సాధిస్తే భారత్ గెలవడం చాలా సులభంగా మారుతుంది. అదే సమయంలో రోహిత్ కనుక ఈ విషయంలో ఫెయిలైతే.. భారత్ చాలా శ్రమించాల్సి వస్తుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఓవరాల్గా చూసుకుంటే భారత్పై విండీస్ టెస్టు రికార్డు మెరుగ్గా ఉంది. కానీ గత రెండు దశాబ్దాల్లో ఒక్క టెస్టులో కూడా భారత్ను విండీస్ ఓడించలేకపోవడం గమనార్హం.
జాఫర్ ఎంచుకున్న జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్