
అక్టోబర్ చివర్లో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీ20 ప్రపంచకప్కు వెళ్లే టీమిండియా మిడిలార్డర్ సెటప్లో వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ జట్టు కూర్పునకు సరిపోవడం లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో జాఫర్ మాట్లాడుతూ.. భారత మిడిల్ ఆర్డర్లో పంత్ ప్రదర్శన అంత బాలేదని, అందుకే అతని స్థానంలో దినేష్ కార్తీక్నే తుది జట్టులో ఆడించాలని చెప్పాడు. నేడు మొహాలీలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టీ20మ్యాచ్ ఆడనుంది. ఇక జాఫర్ తన ప్లేయింగ్ 11 ప్రెడిక్షన్ గురించి మాట్లాడుతూ.. తాను తుది జట్టులో అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్లను చూడాలనుకుంటున్నట్లు జాఫర్ చెప్పాడు. 'ఇటీవల అక్షర్ పటేల్ చాలా బాగా రాణించాడు. కానీ టీం మేనేజ్ మెంట్ అతన్ని ఎందుకు విశ్వసించట్లేదో అర్థం కావడం లేదు. అతను బ్యాటింగ్తో మ్యాచ్లను కూడా గెలిపించగలడు.' అని జాఫర్ చెప్పాడు.
'ఇప్పటికైనా రిషబ్ పంత్ టీ20 సెటప్లో సరిగ్గా ఆడతాడా లేదా అనేది టీం మేనేజ్ మెంట్ గుర్తించాల్సిన అవసరం ఉంది. పంత్ను బరిలోకి దింపడం గురించి టీం పెద్దలు బాగా ఆలోచనలు చేస్తున్నారు. అతను బాగా తెలివైన ప్లేయర్.. అంటూ చాలా సార్లు మాట్లాడారు. టెస్ట్ క్రికెట్, వన్డేలలో అతను కొన్ని కీలక మ్యాచ్లలో రాణించి ఇండియాకు అపురూప విజయాలందించాడు. నేను కాదనను. కానీ T20లలో మాత్రం అతని నుంచి అలాంటి ప్రదర్శనలు రావట్లేదు." అని జాఫర్ అన్నాడు.
'కాబట్టి భారత బ్యాటింగ్ టాప్ సిక్స్లో రిషబ్ పంత్ను ఉండాలనుకుంటున్నారా లేదా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ను ఆడించాలనుకుంటున్నారా అనే విషయాన్ని గుర్తించాలి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. రిషబ్ పంత్ నంబర్ 4 లేదా నంబర్ 5 స్థానాలకు అసలే సరిపోడు. ఓపెనింగ్ బ్యాటింగ్ అతనికి సరైన ప్లేస్ అని నేను అనుకుంటున్నా. కానీ అతన్ని ఓపెనర్గా ఆడించడం దాదాపు జరగదు. అందువల్ల ప్రపంచకప్లో రిషబ్ పంత్ను జట్టు నుంచి పక్కన పెట్టడం సరైన విషయమని నేను భావిస్తున్నా' అని జాఫర్ అభిప్రాయపడ్డాడు.