ఆ జీనియస్ను కలవాలనుంది:
తాజాగా వసీం అక్రమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'ఇంగ్లండ్తో ఓటమిపాలైన తర్వాత జింబాబ్వేతో టూర్ ప్లాన్ చేయడం సరికాదు. ఈ టూర్ ఏర్పాటు చేస్తున్న జీనియస్ను కలవాలనుంది. అతనిపై ప్రశంసలు కురిపించాలనుకుంటున్నా. పాకిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ గొప్ప పని చేస్తున్నావని మెచ్చుకోవాలనుంది' అని చురకలు అంటించాడు. జింబాబ్వేతో సిరీస్లు ఆడడం వల్ల పాకిస్తాన్ క్రికెట్కు ఎలాంటి ఉపయోగం లేదని, ఈ టూర్ ఏర్పాటు చేసిన వారికి మాత్రం చాలా లాభం చేకూరనుందని విమర్శించారు. అక్రమ్ పాక్ తరఫున 104 టెస్టులు, 356 వన్డే మ్యాచ్లు ఆడాడు.
భారత్ మూడో జట్టును కూడా పంపగలదు:
'నాలుగేళ్లకోసారి జింబాబ్వే టూర్ జరిగితే పర్లేదు కానీ. పెద్ద టీమ్లతో ఓటమిపాలైన ప్రతీసారీ పసికూన జట్టుతో ఆడి గెలిచి ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారు. పసికూన జట్లతో ఆడుతూ ర్యాంకులు మెరుగుపరుచుకోవడం తప్ప.. ఈ టూర్ల వల్ల జరిగే ప్రయోజనం ఏమి ఉండదు. టీమిండియాతో పోల్చుకోవడం సరైంది కాదు. బీసీసీఐ క్రికెట్ అభివృద్ధి కోసం ఏం చేయాలో తెలుసుకొని.. అదే చేస్తోంది. ప్రొఫెషనల్ క్రికెటర్లను తయారు చేసేందుకు బీసీసీఐ డబ్బులు ఖర్చు పెడుతోంది. 10 సంవత్సరాల క్రితమే ఈ ప్రక్రియ బీసీసీఐ మొదలుపెట్టింది. ఇప్పుడు ఎంతో మంది ప్లేయర్స్ భారత జట్టుకు అందుబాటులో ఉన్నారు. శ్రీలంకలో ఒక జట్టు, ఇంగ్లండ్లో మరొక జట్టు ఉంది. ఇంకో జట్టును కూడా పంపే శక్తి బీసీసీఐకి ఉంది' అని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు.
దయచేసి ఇలాంటి పనులు ఆపండి:
ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ కమిటీలో సభ్యుడుగా ఉన్న వసీం అక్రమ్.. జట్టులోకి ప్లేయర్స్ను తీసుకోమని రికమండ్ చేయడం మానుకోండని హితవు పలికాడు. 'ప్రియమైన పాకిస్తానీలు.. దయచేసి ఇలాంటి పనులు ఆపండి. చదువుకున్న వారైనా.. కాల్స్ చేయడం మానేయండి. ఇది 21వ శతాబ్ధం. జట్టును ఎంపిక చేయడానికి ముందు నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి. ఫలానా క్రికెటర్ను జట్టులోకి తీసుకోండి, ఈ ప్లేయర్ను ఆడించండి అంటూ రికమండ్ చేస్తున్నారు. ఇవి మమల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఫలానా ప్లేయర్ను తీసుకోమని కోరే బదులు, ఆ క్రికెటర్ను సరిగా ఆడమనండి. దయచేసి ఇలాంటివి పునరావృతం కానీయకండి' అని పాక్తిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో ప్రస్తుత సభ్యుడైన వసీం అక్రమ్ కోరారు.