
వరుస ఓటములు..
ఈ టోర్నీలో తొలుత భారత్ చేతిలో ఓడింది. టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శించిన దూకుడు ముందు పాక్ బౌలర్లు వెలవెలబోయారు. ఆ తరువాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లోనూ ఫలితం మారలేదు. ఫైనల్ ఓవర్ థ్రిల్లర్లో ఒత్తిడికి గురయ్యారు పాకిస్తాన్ బ్యాటర్లు. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా- రెండుతోనే సరిపెట్టుకున్నారు. ఫలితంగా- ఒక్క పరుగు తేడాతో ఓడాల్సొచ్చింది.

నెదర్లాండ్స్తో నెక్స్ట్ మ్యాచ్..
ఇక తన తదుపరి మ్యాచ్ను ఆదివారం ఆడబోతోంది పాకిస్తాన్. నెదర్లాండ్స్తో తలపడనుంది. పెర్త్ స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. రెండు మ్యాచ్లు - రెండు పరాజయాల అనంతరం నెదర్లాండ్స్ను ఢీ కొట్టబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో భారీ రన్రేట్తో గెలిస్తే గానీ తన సెమీ ఫైనల్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోలేదు. తాము సెమీ ఫైనల్స్ చేరడం కష్టసాధ్యమేనంటూ స్వయానా పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ సైతం స్పష్టం చేశాడు.

నంబర్ 3లో బ్యాటింగ్..
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ మాజీ కేప్టెన్, ఆల్రౌండర్ వసీం అక్రమ్ ఇచ్చిన ఓ సలహా ట్రెండ్ అవుతోంది. బాబర్ ఆజమ్కు ఇచ్చిన సూచన అది. సాధారణంగా బాబర్- ఓపెనర్గా ఆడుతుంటాడు. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్తో కలిసి ఇన్నింగ్ను ఆరంభిస్తుంటాడు. అలా కాకుండా- నంబర్ 3లోకి బ్యాటింగ్కు రావాలంటూ ఇదివరకు వసీం అక్రమ్ సూచించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో ఈ ప్రయోగం చేయాలంటూ అప్పట్లో సలహా ఇచ్చినా- బాబర్ ఆజమ్ పెద్దగా పట్టించుకోలేదు.

వసీం అక్రమ్ సలహా..
ఇప్పుడా విషయాన్ని వసీం అక్రమ్ ప్రస్తావించాడు. మిడిలార్డర్ బలహీనంగా ఉందనే విషయం ఏడాది కిందటే తాను పసిగట్టానని చెప్పారు. దీన్ని బలోపేతం చేసుకోవడానికి పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో కొన్ని ప్రయోగాలు చేయొచ్చని భావించానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా- బాబర్ ఆజమ్ నంబర్ 3 పొజీషన్లో బ్యాటింగ్కు దిగితే బాగుంటుందని సూచించినట్లు వివరించారు.

మిడిలార్డర్లో షోయబ్
అదే సమయంలో షోయబ్ మాలిక్ పేరును ప్రస్తావించారాయన. షోయబ్ మాలిక్ను మిడిలార్డర్లో తీసుకోవాలని సూచించారు. షోయబ్ మాలిక్ను జట్టులోకి తీసుకోకపోతే తాను కేప్టెన్గా రాజీనామా చేస్తానని సెలెక్టర్లను బెదిరించి ఉండేవాడినని వసీం అక్రమ్ వ్యాఖ్యానించారు. తానే కేప్టెన్గా ఉండుంటే టీ20 ప్రపంచకప్ను గెలవడానికి తాను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడినని, చివరి తండ్రిని గాడిదను చేయాల్సి వచ్చినా వెనుకాడేవాడిని కాదని చెప్పారు.

ఇది పాకిస్తాన్ కాదు..
టీ20 ప్రపంచకప్ 2022 వంటి మేజర్ టోర్నమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తెలివితేటలకు భిన్నంగా బాబర్ ఆజమ్ కేప్టెన్సీ ఉందని వసీం అక్రమ్ విమర్శించారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా వ్యూహాలను రూపొందించలేకపోతోన్నాడని అన్నారు. ఒక గల్లీ టీమ్తో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్ను ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. బాబర్ ఆజమ్ మరింత ఇంటెలిజెంట్గా తయారు కావాల్సి ఉందని, మిడిలార్డర్ను బలోపేతం చేసుకోవాలని అన్నాడు. ఇది ఆస్ట్రేలియా.. షార్జానో లేదా పాకిస్తాన్లో డెడ్ వికెట్స్ కావని గుర్తుచేశారు.


Click it and Unblock the Notifications












