
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఫేవరెట్ అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. కానీ యంగ్ అండ్ ఉత్తేజకరమైన శ్రీలంక జట్టు పట్ల జాగ్రత్తగా ఉండాలని బాబర్ ఆజామ్ సేనను హెచ్చరించాడు. ఆసియాకప్ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో నిరాశాజనక ఓటమితో టోర్నీని శ్రీలంక ప్రారంభించింది. అయితే తర్వాత పుంజుకున్న శ్రీలంక.. ఓటమనేది లేకుండా టోర్నీలో కొనసాగుతుంది. కెప్టెన్ దసున్ షనక, అతని టీం ఆకట్టుకునే ప్రదర్శనతో అదరగొడుతున్నారు.
ఆ జట్టు బంగ్లాదేశ్, సూపర్ 4దశలో ఆఫ్ఘనిస్థాన్ ఇండియా, పాకిస్తాన్లపై వరుసగా విజయాలు సాధించింది. ఇకపోతే వసీం అక్రమ్.. బీబీఎన్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. పాకిస్తాన్ జట్టు తమ తప్పుల నుంచి నేర్చుకొని ఫైనల్లో చెలరేగుతుందని, ట్రోఫీ ఫేవరెట్గా ఆడబోతుందని తెలిపాడు.
'ఈ ఆసియాకప్లో పాకిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మాత్రం పాక్ బ్యాటింగ్లో ఇంటెన్షన్ తప్పింది. అయితే బౌలింగ్ మాత్రం బానే చేసింది. ఈ మ్యాచ్లో పాక్ తమ తప్పుల నుంచి నేర్చుకుంటుంది. ఫైనల్స్లో పాకిస్థానే ఫేవరెట్ అని నేను భావిస్తున్నాను.
కానీ ఉత్తేజకరమైన, యువ శ్రీలంక జట్టును తేలికగా తీసుకోవద్దు. పాకిస్థాన్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్కు అంతగా అనుభవం లేదని అనిపిస్తోంది. రిజ్వాన్ ఔట్ అయిన తర్వాత గత సూపర్ 4గేమ్లో ఈ విషయంలో బట్టబయలైంది. కానీ ఫైనల్లో ఇది మంచి వికెట్ అవుతుందని, మిడిలార్డర్ బ్యాటర్లు ఆశాజనక రీతిలో మరింత బలంగా తిరిగి వస్తారని భావిస్తున్నా' అని అక్రమ్ తెలిపాడు. బాబర్ ఆజామ్ ఫైనల్లో బాగా రాణిస్తాడని, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ప్రస్తుతం బాబర్ ఒకడని అక్రమ్ చెప్పాడు.
'ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో బాబర్ ఒకడు. అతను మళ్లీ పుంజుకోవడానికి కేవలం ఒకే ఒక మంచి ఇన్నింగ్స్ చాలు. అతను పరుగులు చేయకపోవడంతో కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. కానీ మంచి విషయం ఏమిటంటే.. అతను క్రీజులో ఉన్నప్పుడు కుదురుకోవడానికి అంత టైం తీసుకోడు. ఆసియాకప్ ఫైనల్లో అతను బాగా రాణిస్తాడని భావిస్తున్నాను' అని అక్రమ్ పేర్కొన్నాడు.