Wasim Akram: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న జరగబోయే మ్యాచ్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్పై ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. క్రికెట్ కొనసాగడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
'రాజకీయాలు, దేశభక్తి వేరు.. ఆట వేరు'
ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైన తర్వాత భారత్లో కొందరు అభిమానులు, మాజీ క్రికెటర్లు పాకిస్థాన్తో క్రికెట్ ఆడడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'స్టిక్ విత్ క్రికెట్' అనే పాడ్కాస్ట్లో వసీం అక్రమ్ మాట్లాడుతూ.. "ఆసియా కప్ షెడ్యూల్పై వస్తున్న కఠినమైన స్పందనలను మేం చూశాం. కానీ పాకిస్థాన్లో మేము ప్రశాంతంగా ఉన్నాం. మేము ఆడినా, ఆడకపోయినా పర్వాలేదు. కానీ ఆట మాత్రం కొనసాగాలి" అని అన్నారు. భవిష్యత్తులో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

వసీం అక్రమ్ తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ.. "నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. నేను రాజకీయ నాయకుడిని కాదు. వారు తమ దేశానికి, మేము మా దేశానికి దేశభక్తులం. ఎవరూ హద్దు మీరి మాట్లాడకూడదు. కేవలం తమ దేశం సాధించిన విజయాల గురించి మాత్రమే మాట్లాడాలి. ఈ విషయం భారత్, పాకిస్థాన్ ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ ఇది చెప్పడానికి సులభం, అమలు చేయడం కష్టం" అని అన్నారు. ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటూ, ఈ దిగ్గజ బౌలర్ తన వైఖరిని స్పష్టం చేశారు.
ఆసియా కప్ వివరాలు ఇలా..
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. టీమిండియా తన మొదటి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడుతుంది. ఆసియా కప్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-ఎ: భారత్, పాకిస్థాన్, ఒమన్, యూఏఈ
గ్రూప్-బి: బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్
ఈ టోర్నమెంట్లో మొత్తం 19 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో 11 మ్యాచ్లు దుబాయ్లో, 8 మ్యాచ్లు అబుదాబిలో జరగనున్నాయి. అయితే, భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.