
భారత జట్టులో తన ఫేవరెట్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కొనియాడాడు. ఆసియాకప్ టోర్నమెంట్లోని గ్రూప్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో హార్దిక్ పాండ్యా కీలక రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అతను బౌలింగ్లో పాకిస్తాన్ మిడిలార్డర్ను తీవ్రంగా దెబ్బతీశాడు. అలాగే బ్యాటింగ్లో (17బంతుల్లో 33నాటౌట్)గా నిలిచి భారత గెలుపు లాంఛనాన్ని ముగించాడు. 'నాకు హార్దిక్ పాండ్యా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అతను నిఖార్సైన ఆల్రౌండర్. పాకిస్థాన్కు చెందిన షాదాబ్ ఖాన్ కూడా అలాంటి వాడే. హార్దిక్ గురించి చెప్పాలంటే.. అతను పేస్ బౌలింగ్లో గంటకు 140కి.మీ వేగంతో బౌలింగ్ వేయగలడు. అతను మళ్లీ ఎలెక్ట్రిఫైయింగ్ ఫీల్డర్. అతని బ్యాటింగ్ విషయానికి వస్తే.. అతను ఫియర్లెస్ క్రికెటర్. నేను తప్పుగా అంటున్నాననుకోకపోతే పాకిస్తాన్ తన ఓటమి మనస్తత్వం నుండి వీలయినంత తొందరగా బయటపడాలి. మనం సోషల్ మీడియాలో మీమ్స్ చేయడం వల్ల కావొచ్చు మరేదైనా పోస్టుల వల్ల కావొచ్చు.. లూజింగ్ మైండ్ సెట్ అస్సలు దరిచేరనీయొద్దు' అని వసీమ్ పేర్కొన్నాడు.
భారత్ చేతిలో ఓటమి నుంచి పాకిస్థాన్ చాలా పాఠాలు నేర్చుకుందని భావిస్తున్నానని, భారత్ తమపై ఆడినట్లే నిర్భయ క్రికెట్ పాకిస్థాన్ కూడా ఆడాలని తాను కోరుతున్నానని వసీమ్ అక్రమ్ తెలిపాడు. 'స్వతహాగా పాకిస్థానీ అయిన నేను పాక్ గెలవాలనే కోరుకుంటాను. కానీ టీమిండియా ఇటీవల విజయాల పరంపరతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ గాయాల బారిన పడి మ్యాచ్కు దూరం కావడం టీమిండియాకు కొంత ఇబ్బందికరమే. అతని స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. జడేజా భారత జట్టుకు ప్రధాన ఆటగాడు. అతను, పాండ్యా కలిసి చివరిసారిగా పాకిస్థాన్ను ఓడించి మ్యాచ్ గెలిపించారు. ఆ సమయంలో భారత్ కూడా జడేజాను ప్రమోట్ చేసింది. అదే తరహాలో పాకిస్థాన్ టీ20 క్రికెట్ ఆడే సమయంలో కొన్ని రిస్క్లు తీసుకోవాలి' అని అక్రమ్ పేర్కొన్నాడు.