పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నందుకు ఈ లెజెండరీ క్రికెటర్పై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదైంది. పాకిస్థాన్లో బెట్టింగ్ పూర్తిగా నిషేధించబడినప్పటికీ.. ఆయన ఒక విదేశీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రచారం చేశారని ఆరోపణలు రావడంతో ఆయనపై పాకిస్థాన్ సైబర్ క్రైమ్ డివిజన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటన పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
మహ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి వసీం అక్రమ్పై "పాకిస్థాన్ జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA)"కి ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి ఫిర్యాదు ప్రకారం.. వసీం అక్రమ్ "బాజీ(Baji)" అనే విదేశీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి సాక్ష్యంగా వసీం అక్రమ్ నటించిన ప్రకటన పోస్టర్లు, వీడియోలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. పాకిస్థాన్లో ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ 2016 ప్రకారం ఇది చట్టవిరుద్ధం కావడంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

అధికారుల స్పందన
ఈ ఫిర్యాదు అందిన తర్వాత పాకిస్థాన్ జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దీనిపై స్పందించారు. "వసీం అక్రమ్ ఒక విదేశీ బెట్టింగ్ యాప్కు ప్రచారకర్తగా ఉన్నారని మాకు ఫిర్యాదు అందింది. ఈ ఆరోపణలు నిజమైతే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం" అని ఓ అధికారి ధ్రువీకరించారు.
అక్రమ్ మౌనం.. అభిమానుల ఆవేదన
'స్వింగ్ సుల్తాన్'గా పేరుగాంచిన వసీం అక్రమ్ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ మౌనం ఆయన అభిమానుల్లో మరింత ఆందోళన కలిగించింది. ఓ లెజెండ్ బెట్టింగ్ను ప్రోత్సహించడం సరైనదేనా అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఇదే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రచారం చేసినందుకు ప్రఖ్యాత యూట్యూబర్ సాద్-ఉర్-రెహ్మాన్(డక్కీ బాయ్) అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వసీం అక్రమ్పై కూడా ఫిర్యాదు నమోదు కావడంతో, ఈ కేసు మరింత తీవ్రతను సంతరించుకుంది. పాకిస్థాన్ క్రికెట్లో ఒక ఐకాన్గా ఉన్న అక్రమ్పై వచ్చిన ఈ ఆరోపణలు అతని ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.