పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన గురించి ఆ దేశ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గెలిచే స్థితి నుంచి పాక్ ఓటమిపాలవ్వడం తీవ్రంగా కలిచివేసిందని అన్నాడు. ఈ ఘోర ఓటమి తమ దేశ క్రికెట్ నాణ్యత డొల్లతనం గురించి తెలియజేసిందని తెలిపాడు. భవిష్యత్ దిశగా కీలకమైన మార్పులు చేయాలని సూచించాడు.
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను పాకిస్థాన్ 0-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై విజయం లేకుండా పాక్ వరుసగా పది టెస్టులు ముగించింది. 2021 నుంచి పాక్కు గెలుపు దక్కట్లేదు. గత పది మ్యాచ్ల్లో ఆరింట్లో ఓటమి పాలైంది. నాలుగ మ్యాచ్లను డ్రాగా ముగించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లా చేతిలో సిరీస్లను కోల్పోయింది. న్యూజిలాండ్తో సిరీస్ను డ్రాగా ముగించింది.

ఈ క్రమంలో గత ఆరు దశాబ్దాల్లో టెస్టు ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ తమ పేలవ ర్యాంక్ను అందుకుంది. ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్లో పాక్కు ఇదే దారుణమైన ర్యాంక్. అయితే రెండో టెస్టులో బంగ్లా 26/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ లిటన్ దాస్ పోరాటంతో బంగ్లాదేశ్ తిరిగి పోటీలోకి వచ్చింది. తొలి టెస్టులో పాకిస్థాన్ ఓ దశలో ఆధిపత్యం చెలాయించింది. కానీ ముష్ఫికర్ రహీమ్ సంచలన ఇన్నింగ్స్తో పాక్ను దెబ్బతీశాడు.
''మంచి స్థితి నుంచి పాకిస్థాన్ ఓటమిపాలవ్వడాన్ని.. ఓ మాజీ ఆటగాడిగా, మాజీ కెప్టెన్గా, క్రికెట్ ప్రేమికుడిగా చూడలేకపోతున్నాను. ఇబ్బంది పడుతున్నాను. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇది భారీ ఎదురుదెబ్బ. కీలక నిర్ణయాలు తీసుకోవాలి. సొంతగడ్డపై మేం వరుసగా ఓటమిపాలవుతున్నాం. ఇది మా క్రికెట్ నాణ్యత గురించి తెలుపుతుంది'' అని వసీమ్ అక్రమ్ అన్నాడు.
కాగా, బంగ్లా చేతిలో ఘోర ఓటమితో పాక్ జట్టులో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది. ముందుగా తమకు అలవాటు అయిన కెప్టెన్సీ మార్పును చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది తమ దేశంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు లక్ష్యంగా జట్టును నిర్మించాలనుకుంటుంది.