
ఇప్పటికే టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని
ఇప్పటికే టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనిని ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా అభిమానులు చూడలేరు. అయితే, వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో ధోని తప్పక ఆడాలని పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ సూచించాడు.

ఫామ్ అనేది తాత్కాలికం
ఇండియా టీవికి ఇచ్చిన ఇంటర్యూలో "ఫామ్ అనేది తాత్కాలికం అని, క్లాస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి, వచ్చే వరల్డ్కప్లో ధోనిని చూడాలని అనుకుంటున్నా. ధోని ఓ మ్యాచ్ విన్నర్, అతడిలో ఇంకా క్రికెట్ ఉందని నేను భావిస్తున్నా, ఇంగ్లాండ్లో జరిగే వరల్డ్ కప్లో ధోని అనుభవం టీమిండియాకు అవసరం" అని అన్నాడు.

ధోని తప్పక ఫామ్ అందుకుంటాడు
రెండు రోజుల క్రితం మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం వరల్డ్కప్ నాటికి టీమిండియా మహేంద్ర సింగ్ ధోని తప్పక ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ మాట్లాడుతూ "ధోని దిగ్గజ ఆటగాడు. 2019 వరల్డ్కప్లో అతడు జట్టులో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని నా నమ్మకం. క్రికెట్ ప్రపంచంలో ఇప్పటికీ ధోనీనే అత్యుత్తమ వికెట్ కీపర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతడు ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడు" అని అన్నాడు.

2019 వరల్డ్కప్లోనూ ధోని
"2018 ఐపీఎల్ సీజన్లో ధోని బ్యాటింగ్ నన్ను ఆకట్టుకుంది. చాలా స్వేచ్ఛగా ఆడాడు. అతను అలా ఆడితే, ప్రత్యర్థి జట్టు మ్యాచ్పై ఆశలు వదులుకోవాల్సిందే. 2019 వరల్డ్కప్లోనూ ధోని తన సహజసిద్ధమైన ఆట ఆడితే తప్పక రాణిస్తాడు. ఇందుకోసం అతడు ముందే ఫామ్ను అందుకోవాల్సి ఉంటుంది" అని లక్ష్మణ్ వెల్లడించాడు.


Click it and Unblock the Notifications













