
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రకు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. తమను ప్రోత్సహిస్తూ, మద్దతుగా నిలవడంతో పాటు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాడు. ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్ 2-1తో గెలిచిన అనంతరం ఆరుగురు భారత యువ ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా 'థార్ ఎస్యూవీ' కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. సుందర్తో పాటు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, నవదీప్ సైనీ, టీ నటరాజన్లకు మహీంద్రా కార్లను ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రాకు వాషింగ్టన్ సుందర్ కృతజ్ఞతలు చెబుతూ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. 'ఆనంద్ మహీంద్రా సర్.. మీరు బహుమతి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా యువకులకు ఇస్తున్న ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు. మా అత్యుత్తమ ప్రదర్శనను ఇలానే కొనసాగిస్తాం' అని సుందర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రధాన ఆటగాళ్లు దూరమైనా భారత యువ ఆటగాళ్లు అద్భుత పోరాటంతో గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సుందర్ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అర్ధ శతకం సాధించడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఆనంద్ మహీంద్ర వారం క్రితం ఆరుగురు టీమ్ఇండియా ఆటగాళ్లను ప్రశంసించడంతో పాటు.. ఖరీదైన బహుమతులతో వారిని ఆశ్చర్యపర్చారు. ఆరుగురు ఆటగాళ్లు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని, వీరివి నిజ జీవిత విజయగాథలని ఆనంద్ మహీంద్ర కొనియాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భావి భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. యువత ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే వీరిని బహుమతులతో ప్రోత్సహించినట్లు మహీంద్ర తెలిపారు. ఆరుగురు ఆటగాళ్లకు సంబందించిన కొన్ని వివరాలను తాను ట్వీట్ చేసిన వీడియోలో అభిమానులతో పంచుకున్నారు.
బోర్డర్-గవాస్కర్ సిరీస్లో అరంగేట్ర ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నారు. సిరాజ్ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయగా.. నటరాజన్ అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి మంచి ప్రదర్శన చేశాడు. సుందర్ (62), శార్దూల్ (66) నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అర్ధ శతకాలతో రాణించారు. శుభ్మన్ గిల్ ఓపెనర్గా రాణించాడు. సైనీ తనవంతు పాత్ర పోషించాడు. ఇక ఫిబ్రవరి 5నుంచి భారత్తో ఇంగ్లాండ్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్లో ఉన్నారు.