హైదరాబాద్: గత కొన్నేళ్లుగా టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కెరీర్ గ్రాఫ్ దూసుకుపోతంది. తాజాగా వాషింగ్టన్ సుందర్ను మద్రాస్ చెన్నపట్న రోటరీ క్లబ్ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా 'యంగ్ అచీవర్' పురస్కారంతో సత్కరించింది. అవార్డు తీసుకున్న తర్వాత సుందర్ భావోద్వేగంగా మాట్లాడాడు.
తన కెరీర్ ఎదుగులలో సాయం చేసిన ప్రతి ఒక్కరికీ సుందర్ ధన్యవాదాలు తెలిపాడు. 'నా చుట్టూ ఉన్నవాళ్లంతా గొప్పవారు. వారెప్పుడూ నేను ఎదగాలనే కోరుకున్నారు. నా జీవితంలోని ప్రతి దశలో నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నేను ఎదుగుతున్న క్రమంలో అమిర్ మహల్ మైదానంలో నేను సాధన చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన మహ్మద్ అసిఫ్ అలీ (ఆర్కాట్ సంస్థానం రాజకుమారుడు)కి నేనెంతో రుణపడి ఉన్నాను. నా కోసం ఆయన అత్యున్నత మౌలిక సదుపాయాలు కల్పించారు' అని సుందర్ ఈ సందర్భంగా అన్నాడు.
మరోవైపు టీమిండియా మాజీ స్పిన్నర్ వెంకటరమణకు కూడా సుందర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన తనకెంతో మద్దతుగా నిలిచారని, విలువైన సలహాలు ఇచ్చారని తెలిపాడు. ఈ సందర్భంగా వాషింగ్టన్ సుందర్కు అసలైన పరీక్షను రాబోయే రోజుల్లో ఎదుర్కొంటాడని వెంకట రమణ అన్నారు.
గతేడాది డిసెంబర్లో వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, బెంగళూరు వేదికగా జనవరి 27, 28తేదీల్లో జరిగిన వేలంలో వాషింగ్టన్ సుందర్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.