
హైదరాబాద్: శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీ20 జట్టులోకి అరంగేట్రం చేశాడు. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో మణికట్టు స్పిన్నర్ చాహల్కి విశ్రాంతినిచ్చి అతడి స్ధానంలో 18 ఏళ్ల సుందర్కి తుది జట్టులో చోటు కల్పించారు.
దీంతో భారత టీ20 జట్టులోకి వచ్చిన అత్యంత పిన్న వయస్కుడిగా వాషింగ్టన్ సుందర్ అరుదైన ఘనత సాధించాడు. సుందర్ వయసు 18 ఏళ్ల 80 రోజులు మాత్రమే. భారత్ తరుపున అరంగేట్రం చేసిన పిన్నవయస్కుల జాబితాలో సుందర్ ఏడో వాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్తో టీమిండియాలోకి వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేశాడు.
అయితే తన తొలి వన్డేలో పొదుపుగా బౌలింగ్ చేసిన ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. ఐపీఎల్లో సుందర్ ప్రదర్శనని గమనించిన ధోని, రోహిత్ శర్మ టీ20 జట్టులో అతనికి ఒక అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా మూడో టీ20లో సుందర్ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడు శరన్దీప్ సింగ్ వాషింగ్టన్ సుందర్కు క్యాప్ అందించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే మూడో టీ20లో ఇన్నింగ్స్ తొలి ఓవర్నే వాషింగ్టన్ సుందర్తో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.