
అహ్మదాబాద్: భారత్తో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసి.. టీమిండియాకు 165 పరుగుల లక్ష్యంను ఉంచింది. స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ (46; 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) మెరిశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (28; 20 బంతుల్లో 4 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లీష్ బ్యాట్స్మన్లు భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం లేకుండాపోయింది. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ (0)ను పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడో బంతికే పెవిలియన్కు పంపాడు. దీంతో ఒక్క పరుగుకే ఇంగ్లీష్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 459 రోజుల తర్వాత భువీ తొలి వికెట్ పడగొట్టాడు. తర్వాత ఓపెనర్ జేసన్ రాయ్, వన్డౌన్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ (24; 23 బంతుల్లో 4x4) ధాటిగా ఆడారు. బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచారు. రెండో వికెట్కు 63 పరుగులు జోడించారు.
ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్నరాయ్, మలన్ జోడీని యుజ్వేంద్ర చహల్ విడదీశాడు. ఓ చక్కటి బంతితో మలన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 64/2గా నమోదైంది. తర్వాత జానీ బెయిర్స్టో (20; 15 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి రాయ్ మరింత రెచ్చిపోయాడు. అయితే అర్ధ శతకానికి చేరువైన అతడిని వాషింగ్టన్ సుందర్ బోల్తా కొట్టించాడు. భువీకి క్యాచ్ ఇచ్చి రాయ్ వెనుదిరిగాడు.
పై బెయిర్స్టో, ఇయాన్ మోర్గాన్ (28; 20 బంతుల్లో 4x4) బౌండరీలు బాదినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. వాషింగ్టన్ సుందర్.. బెయిర్స్టోను, శార్ధూల్ ఠాకుర్.. మోర్గాన్ను పెవిలియన్ పంపాడు. చివర్లో బెన్ స్టోక్స్ (24), సామ్ కరన్ (6) ధాటిగా ఆడి జట్టు స్కోరును 165/6కి తీసుకెళ్లారు. ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసేలా కనిపించినా.. భువనేశ్వర్, శార్ధూల్ చివరలో కట్టడి చేశారు. కొన్ని అద్భుత బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్మన్ను కట్టడి చేశారు.