
సాక్షి పుట్టిన రోజు వేడుకల్లో పాండ్య తీరు
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సతీమణి సాక్షి పుట్టిన రోజు వేడుకల్లో హార్దిక్ పాండ్య వ్యవహరించిన తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ముంబైలో అట్టహాసంగా ఆదివారం జరిగిన సాక్షి 29వ పుట్టిన రోజు వేడుకకి వచ్చిన హార్దిక్ పాండ్య.. ఆమె కేక్ కట్ చేస్తుండగా.. వెనుక సిగరెట్ తాగుతూ కనిపించాడు.
సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో
దీనికి సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ధోనీ వెనుక.. అదీ.. అతని సతీమణి పుట్టిన రోజు వేడుకల్లో ప్రముఖుల మధ్య సిగరెట్ తాగిన హార్దిక్ పాండ్యాపై ఇప్పుడు ధోనీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కప్లో బౌలింగ్ చేస్తుండగా గాయపడిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత వెస్టిండీస్తో సిరీస్ మొత్తానికి దూరమైయ్యాడు.

ఫిట్నెస్ సాధించలేకపోవడంతో.. పక్కకి
నవంబరు 21 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనకీ హార్దిక్ ఫిట్నెస్ సాధించలేకపోవడంతో.. అతడ్ని పక్కన పెట్టేశారు సెలక్టర్లు. ఆల్రౌండర్ కోటాలో కృనాల్ పాండ్యాని టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఆసీస్ గడ్డపై భారత్ జట్టు మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్ని ఆడనుండగా.. టీ20 జట్టు నుంచి ధోనీ తప్పించి రిషబ్ పంత్కి వికెట్ కీపర్గా సెలక్టర్లు ఛాన్సిచ్చిన విషయం తెలిసిందే.

పాండ్యా లేకపోవడం జట్టులో లోపమే.
ఈ పర్యటనలో హార్దిక్ పాండ్యా లేకపోవడం జట్టులో లోపమే. అతను ఉంటే సమతూకంగా ఉండేదని కోచ్ రవిశాస్త్రి శాస్త్రి పేర్కొన్నాడు. టీమిండియా పటిష్టంగా ఉందని ఈ సారి ఆస్ట్రేలియా గడ్డపై తమ ప్రత్యేకత చాటుకుంటామని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications

