న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ శశాంక్ మనోహర్ పేరు బయట పడింది. ఆమ్రపాలి గ్రూప్ సీఎండీ అనిల్ కుమార్ శర్మ గృహ కొనుగోలుదారులు చెల్లించిన నిధుల నుంచి రూ.36 లక్షలను అక్రమంగా మనోహర్ ఖాతాలో వేసినట్లు సుప్రీం కోర్టు తన తీర్పులో తెలిపింది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లు మూకుమ్మడిగా నిధులను దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సుప్రీం కోర్ట్ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ కుంభకోణానికి పాల్పడిన ఆమ్రపాలి డైరెక్టర్లు నిధులను తప్పుగా మళ్లించడంను 'నిధుల దుర్వినియోగం' అని కోర్టు పేర్కొంది. సుప్రీం తీర్పులో.. అనిల్ కుమార్ శర్మ చెల్లింపులు ( దారి మళ్లిన నిధులను పొందినట్లు) చేసిన వారి జాబితాలో శశాంక్ మనోహర్ పేరు రెండు సార్లు ఉంది. దీనిపై ఆయన స్పందిస్తూ... 'ఈ కేసులో నాలుగేళ్ల క్రితమే పట్నా హైకోర్టులో హాజరైయ్యాను' అని తెలిపారు. ఈ కేసుతో తనకేం సంబంధం లేదని అన్నాడు.
మరోవైపు ఆమ్రపాలి సంస్థకు ఎంఎస్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ధోనీ భార్య సాక్షికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు అక్రమ పద్ధతిలో ఆమ్రపాలి గ్రూపు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు తేలింది. సుమారు 40 వేల మంది కస్టమర్లను ఆమ్రపాలి రియల్ సంస్థ మోసం చేసింది. ఆ కేసులో ఆ రియల్ ఎస్టేట్ సంస్థ లైసెన్సును రద్దు చేస్తూ మంగళవారమే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఫోరెన్సిక్ ఆడిటర్లు తమ నివేదికలో మరో కోణాన్ని ఉంచారు. ఇండ్లు కొనాలనుకునేవారి డబ్బును అక్రమ పద్ధతిలో రితి స్పోర్ట్స్ సంస్థకు తరలించారని, ఆ సొమ్మును వసూల్ చేయాలని ఫోరెన్సిక్ ఆడిటర్లు తమ రిపోర్ట్లో పేర్కొన్నారు.