
ఐపీఎల్ 2022లో సన్రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు తలపడనుంది. ఈ మ్యాచ్లో అందరి కళ్లు డేవిడ్ వార్నర్పైనే ఉన్నాయి. 2014నుండి 2021వరకు ఐపీఎల్ సీజన్లలో సన్ రైజర్స్తో వార్నర్కు మంచి అనుబంధం ఉంది. కానీ వార్నర్ గత సంవత్సరం చేదు అనుభవాన్ని ఎదుర్కొని సన్ రైజర్స్ నుంచి వైదొలిగాడు. గత సీజన్లో టోర్నీ మధ్యలోనే కెప్టెన్గా వార్నర్ను జట్టు మేనేజ్మెంట్ తొలగించింది. ఆ తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కూడా అతన్ని తప్పించింది. వార్నర్కు సన్రైజర్స్ జట్టు మేనేజ్మెంట్కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడంతో ఇక ఐపీఎల్ మెగా ఆక్షన్కు ముందు వార్నర్ను రిటైన్ కూడా చేసుకోలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో వార్నర్ను రూ.6కోట్లకు దక్కించుకుంది. ఇక ఈ సీజన్ తొలి మ్యాచ్లకు దూరమైన వార్నర్.. లేటుగా ఢిల్లీ జట్టుతో చేరాడు. ఆడిన 7మ్యాచ్లలో మూడు అర్ధసెంచరీలతో సహా 264పరుగులు చేసి మంచి ఫామ్ కనబర్చాడు. ఇక ఒకప్పుడు తన జట్టు అనే పేరున్న సన్ రైజర్స్ ఇప్పుడు తనకు శత్రువులా మారిపోయిన వేళ నేడు ఆ జట్టుతో మ్యాచ్ కోసం వార్నర్ రెడీ అయిపోయి ఉండొచ్చు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే ఇన్నింగ్స్ తో వార్నర్ చెలరేగిపోతాడని భారత మాజీ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు.
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా మాట్లాడుతూ.. 'ఇది చాలా ఉత్తేజకరమైన, ఉద్విగ్నమైన టైం. వార్నర్ తప్పకుండా సన్రైజర్స్తో మ్యాచ్లో బ్యాటింగ్కు దిగే ముందు తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలని చూస్తాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకడైన వార్నర్ సన్రైజర్స్ తరఫున చాలా పరుగులు చేశాడు. టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నాడు. అతని సారథ్యంలోనే 2016లో సన్ రైజర్స్ టైటిల్ను అందుకుంది. జట్టు కోసం అంత చేసినప్పటికీ.. గత సీజన్లో వార్నర్తో ఆ జట్టు యాజమాన్యం వ్యవహరించిన తీరు అతన్ని కలిచివేసే ఉంటుంది. ప్రస్తుతం మళ్లీ ఫామ్ అందుకున్న వార్నర్ ఇక సన్ రైజర్స్ మీద చెలరేగే అవకాశముంది. ఈ సీజన్లో సన్రైజర్స్ బౌలర్లు వార్నర్ బ్యాటింగ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి' అని సూచించాడు.

అలాగే చావ్లా డీసీ కెప్టెన్ రిషభ్ పంత్ బ్యాటింగ్ సమస్యలపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. పంత్ కొన్ని షాట్లను ఆడకపోవడం మంచిదని సూచించాడు. పాత రిషబ్ పంత్ కొత్త స్టైల్తో కావాలని పేర్కొన్నాడు. స్లాట్లో బంతి పడ్డప్పుడే పంత్ బాదాలి అన్నాడు. ప్రెషర్ బట్టి అనవసర షాట్లతో వికెట్ సమర్పించుకోవద్దని తెలిపాడు.