హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా మొహాలిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ నాకౌట్ ఆశలు సజీవమయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఓపెనర్ వార్నర్ (58) అర్ధ శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో తడబడిన పంజాబ్20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. మురళీ విజయ్ (12), వోహ్రా (5), మార్ష్ (1) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా వృద్ధిమాన్ సాహా (42), బెయిలీ (22) కాసేపు సన్రైజర్స్ బౌలర్లను ప్రతిఘటించి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపారు. అయితే చివర్లో హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పంజాబ్ వరుస వికెట్లు తీయడంతో సన్రైజర్స్ గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఓపెనర్ శిఖర్ ధావన్ (1) ఆదిలోనే జాన్సన్ బౌలింగ్లో ఔటై నిరాశపరిచాడు. మరో ఓపెనర్ వార్నర్ (58) ధాటిగా ఆడటంతో హైదరాబాద్ 5.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. భారీ స్కోరు దిశగా సాగుతున్న సన్రైజర్స్ను 76 పరుగుల వద్ద అక్షర్ పటేల్ దెబ్బతీశాడు.

అక్షర్ బౌలింగ్లో వార్నర్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిల్లర్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సన్రైజర్స్ స్కోరు బోర్డు ఒక్కసారిగా నెమ్మదించింది. మధ్యలో హెన్రిక్స్ (30), నమన్ ఓజా (28) సన్రైజర్స్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. వీరి ఔట్ అనంతరం చివరి ఓవర్లో ఆశిష్రెడ్డి (22 నాటౌట్) రెండు భారీ సిక్స్లు బాదడంతో హైదరాబాద్ 150 పరుగులు చేయగలిగింది.
సంక్షిప్తంగా స్కోర్లు
సన్ రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 (వార్నర్ 58, హెన్రిక్స్ 30, నమన్ ఓఝా 28, ఆశిష్ రెడ్డి 22 నాటౌట్) పంజాబ్ బౌలింగ్ జాన్సన్ 2/39, అక్షర్ పటేల్ 2/25.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 (వృద్ధిమాన్ సాహా 42, బెయలీ 22) హైదరాబాద్ బౌలింగ్ బౌల్ట్ 3/19.