
హిందువుల మధ్యలో నమాజ్ చేయడం బాగుంది:
ఇక పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ కూడా భారత్-పాక్ మ్యాచ్పై స్పందించాడు. భారత్తో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన పాక్ కీపర్, బ్యాటర్ రిజ్వాన్ డ్రింక్స్ విరామం సందర్భంగా నమాజ్ చేశాడు. దీనిపై వకార్ ఓ ఛానెల్తో మాట్లాడుతూ.. 'మ్యాచ్ సందర్భంగా హిందువుల మధ్యలో మొహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడం నన్నెంతో ఆకట్టుకుంది. ఇది పాక్ గెలుపుకంటే మరింత కిక్ ఇచ్చింది'అని వ్యాఖ్యానించాడు. దీనిపై పలువురి నుంచి అభ్యంతరాలు అతడు ఎదుర్కొన్నాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా వకార్ వ్యాఖ్యలను తప్పుపట్టాడు. జెంటిల్మెన్ గేమ్గా పిలవబడే క్రికెట్లో ఇలాంటి మాటలు సరికాదని, వకార్ క్షమాపణలు చెప్పాలని కోరాడు.

మండిపడ్డ హర్షా భోగ్లే:
'వకార్ యూనిస్ లాంటి స్థాయి గల వ్యక్తి అలా మాట్లాడడం నిరాశ కలిగించింది. మనలో చాలా మంది అలాంటి విషయాలు ఆటలో రాకుండా ఉంచడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాం. ఆట గురించే మాట్లాడతాం. క్రికెట్ రాయబారులుగా క్రికెటర్లు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. వకార్ క్షమాపణలు చెబుతాడని అనుకుంటున్నా. మనం క్రికెట్ ప్రపంచాన్ని ఏకం చేయాలి. మత ప్రాతిపదికన విభజించకూడదు' అని హర్షా భోగ్లే అన్నాడు. భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం వకార్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశాడు. దాంతో వకార్పై ముప్పేటదాడి జరిగింది.
నన్ను క్షమించండి:
వకార్ యూనిస్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సోషల్ మీడియాలో మండిపడటంతో అతడు దిగొచ్చాడు. చివరకు వకార్ ట్విటర్లో క్షమాపణలు తెలిపాడు. 'క్షణికావేశంలో చేసిన వ్యాఖ్యలు అవి. ఎవరినీ ఉద్దేశించి చేసినవి మాత్రం కావు. ఎవరి మనోభావాలను గాయపరచాలని అలా అనలేదు. ఈ వ్యాఖ్యలు కావాలని చేసినవి కావు. ఎవరి సెంటిమెంట్స్ను హర్ట్ చేయాలని కాదు. ప్రజలనంతా ఏకం చేసేవి క్రీడలు. మతం, రంగు, జాతి వంటి వాటికి ఆటల్లో చోటు లేదు. తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి' అని పాకిస్థాన్ మాజీ ప్లేయర్ ట్వీట్ చేశాడు.

10 వికెట్ల తేడాతో ఘన విజయం:
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటేనే ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నది. టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియాపై పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (57), రిషబ్ పంత్ (39) రాణించారు. లక్ష్య ఛేదనలో మహమ్మద్ రిజ్వాన్ (79), బాబర్ అజామ్ (68) అర్ధ శతకాలు చేయడంతో వికెట్ నష్టపోకుండా 17.5 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో ప్రపంచకప్ టోర్నీల్లో భారత్పై గెలవలేదనే అపవాదును పాక్ చెరిపేసుకుంది.


Click it and Unblock the Notifications












