Wankhede Stadium Heist: ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) జెర్సీని సొంత చేసుకోవాలనేది ఎందరో క్రికెట్ అభిమానుల కల. అయింతే ముంబైలోని బీసీసీఐ కార్యాలయం లో పని చేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డు ఈ కోరికను కాస్త అతిగా తీర్చుకున్నాడు. ఏకంగా ఒక కార్టన్ నిండా ఉన్న ఐపీఎల్ 2025 జెర్సీలను దొంగిలించి వార్తల్లో నిలిచాడు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి 40 ఏళ్ల ఫారూక్ అస్లామ్ ఖాన్ అనే ఈ సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు.
రూ.6.52 లక్షల విలువైన జెర్సీల చోరీ వివరాలు ఇలా..
వాంఖడే స్టేడియం, చర్చ్ గేట్లోని బీసీసీఐ కార్యాలయంలోని స్టోర్ రూమ్ నుంచి మొత్తం 261 ఐపీఎల్ జెర్సీలు మాయమయ్యాయి. వీటి విలువ సుమారు 6.52 లక్షలుగా అంచనా వేస్తున్నారు. ఒక్కో జెర్సీకి దాదాపు రూ.2,500 ధర ఉంటుందని తెలుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన గార్డు ఫారూక్ అస్లామ్ ఖాన్.. ఈ జెర్సీలను విక్రయించి వచ్చిన డబ్బును తన ఆన్లైన్ జూద వ్యసనం కోసం ఖర్చు చేసినట్లు అంగీకరించాడు.

ఈ చోరీకి గురైన జెర్సీలు వివిధ ఐపీఎల్ జట్లకు సంబంధించినవి. అవి ఆటగాళ్ల కోసం ఉద్దేశించినవా లేదా అభిమానుల కోసం రూపొందించినవా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదు. మీరా రోడ్డులో నివసించే ఫారూక్ అస్లామ్ ఖాన్.. సోషల్ మీడియా ద్వారా హర్యానాకు చెందిన ఒక ఆన్లైన్ జెర్సీ డీలర్ తో పరిచయం పెంచుకొని.. ఈ జెర్సీలను అతనికి విక్రయించాడు.
ఆడిట్ ద్వారా వెలుగులోకి దొంగతనం
ఈ జెర్సీల దొంగతనం జూన్ 13న జరిగినప్పటికీ.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ కార్యాలయంలో స్టాక్ ఆడిట్ నిర్వహించినప్పుడు వస్తువులు కనిపించడం లేదని గుర్తించడంతో.. వెంటనే బీసీసీఐ అధికారులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఫుటేజీలో సెక్యూరిటీ గార్డు ఫారూక్ అస్లామ్ ఖాన్ ఒక భారీ కార్డ్బోర్డ్ పెట్టెను లాక్కెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
"ఆ సెక్యూరిటీ గార్డు ఆన్లైన్ డీలర్తో ధర గురించి కాస్త బేరం ఆడానని చెబుతున్నాడు. అయితే ఆ ఒప్పందం ద్వారా అతనికి ఎంత డబ్బు వచ్చిందో ఇంకా స్పష్టంగా చెప్పడం లేదు," అని ఓ పోలీసు అధికారి తెలిపారు. దొంగిలించిన జెర్సీలను కొరియర్ ద్వారా హర్యానాకు పంపినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, పోలీసులు హర్యానాకు చెందిన ఆన్లైన్ డీలర్ను కూడా పిలిపించి విచారించారు. ఆ జెర్సీలు దొంగిలించబడినవని తనకు తెలియదని ఆన్లైన్ డీలర్ చెప్పినట్లు తెలిసింది. బీసీసీఐ కార్యాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున.. ఈ జెర్సీలు స్టాక్ క్లియరెన్స్ అమ్మకంలో భాగంగా ఉన్నాయని సెక్యూరిటీ గార్డు ఆన్లైన్ డీలర్కు చెప్పినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఆన్లైన్ జూద వ్యసనం
దొంగిలించబడిన మొత్తం జెర్సీలలో కేవలం 50 జెర్సీలను మాత్రమే పోలీసులు ఇప్పటివరకు తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. ఆన్లైన్ డీలర్ నుంచి గార్డుకు వచ్చిన డబ్బు నేరుగా అతని బ్యాంక్ ఖాతాలో జమ అయింది. తాను ఆ డబ్బును మొత్తం ఆన్లైన్ జూదంలో కోల్పోయానని సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయాలను ధ్రువీకరించడానికి పోలీసులు ప్రస్తుతం అతని బ్యాంక్ ఖాతా వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈ చోరీపై బీసీసీఐ అధికారి ఒకరు జులై 17న మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.