దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్.. ఈ పేరు క్రికెట్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన ఆటతీరు, ముఖ్యంగా బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతం. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ లో అద్భుతాలు సృష్టించిన ఈయన ఇప్పుడు కామెంటేటర్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం మైదానంలో తన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకుంటోన్న గావస్కర్, అప్పుడప్పుడు వివాదస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా తనలోని డ్యాన్సర్ ను మరోసారి బయటకు తీశారు. స్టేజ్ పైన తోటి క్రికెటర్లతో కలిసి చిందులేస్తూ సందడి చేశాడు. మరో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ కూడా పాట పాడుతూ ఉత్సాహంతో కనిపించారు.
ఫుల్ జోష్ లో సచిన్, గావస్కర్
వాంఖడే స్టేడియం 50 ఏళ్ల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. తాజాగా ఆ సంబరాలకు ముగింపు పలుకుతూ చివరి రోజు ఏంసీఏ ఘనంగా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ వేడుకలో క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్ తో పాటు రవిశాస్త్రి, డయానా ఎడుల్జీ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ దిగ్గజాలంతా కలిసి స్టేజ్ పై తమ సరదా సంభాషణలతో, చర్యలతో క్రికెట్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు. అలా ఈ ఈవెంట్ లోనే దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఇదే స్టేజ్ పై ఓం శాంతి ఓం పాటను ప్లే చేయగా, సచిన్ తెందుల్కర్ కూడా పాటను ఆలపిస్తూ ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

వాంఖడే వారికోత్సవ సెలబ్రేషన్స్ లో గావస్కర్ మాట్లాడుతూ.. తొలి చూపులోనే వాంఖడే స్టేడియంతో ప్రేమలో పడినట్లు చెప్పారు. "1974లో వాంఖడే స్టేడియం కట్టినప్పుడు మా డ్రెస్సింగ్ రూమ్ కింద ఉండేది. అప్పుడు తొలి సారి ప్రాక్టీస్ కోసం మైదానంలో అడుగుపెట్టినప్పుడు ఈ స్టేడియంతో ప్రేమలో పడ్డా. ఇక్కడికి వస్తే నా హోమ్ గ్రౌండ్ లా ఫీలవుతాను. ఈ ఫీలింగ్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడు కూడా కామెంటేటరీ కోసం ఇక్కడి వస్తే అదే ఫీలింగ్ నాలో కలుగుతుంది. నా గుండె గర్వంతో ఉప్పొంగుతుంది" అని చెప్పుకొచ్చారు గవాస్కర్.
కాగా, 1975, జనవరి 19న జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోని టీమిండియా జట్టులో గావస్కర్ కూడా ఒకరు. టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగుల మార్క్ ను అందుకున్న తొలి బ్యాటర్ గానూ రికార్డు సాధించారు.