
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ ప్రారంభం కావడానికి నెల కన్నా తక్కువ సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్లో ఉన్నాయి. ఐపీఎల్ 2020 టోర్నమెంట్ సెప్టెంబర్ 19న ప్రారంభం అయి నవంబర్ 10న ముగుస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపినా.. అధికారిక షెడ్యూల్ మాత్రం ఈవారం రోజుల్లో రానుంది. గత శుక్రవారం ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దుబాయ్ గడ్డపై అడుగుపెట్టింది.
సీఎస్కే ఆటగాళ్ళ అందరికి ఓ లగ్జరీ హోటళ్ళో బస ఏర్పాటు చేసింది జట్టు యాజమాన్యం. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ క్వారంటైన్లో ఉన్నారు. లగ్జరీ హోటల్లో ఉన్న టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే స్టార్ బ్యాట్స్మన్ సురేష్ రైనా.. దానికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశాడు. దుబాయ్లో భవనాల ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని కోడ్ చేస్తూ అభిమానుల కోసం ఒక పోస్ట్ పెట్టాడు. 'దుబాయ్ లైఫ్!!. అబ్బురపరిచే ఆకాశ విహంగం దృశ్యం దుబాయ్' అని క్యాప్షన్ జోడించాడు. ఆ వీడియోలో అక్కడి ఓ భవన నమూనాను రైనా చూపించాడు.
ఐపీఎల్ 2020లో భాగంగా లగ్జరీ హోటల్లో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తున్న సురేష్ రైనా.. మూడు కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్న తర్వాత సీఎస్కేతో కలవనున్నాడు. మూడు టెస్టుల్లో నెగిటివ్ అని తేలితేనే.. ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే.. మళ్లీ క్వారంటైన్కు వెళ్లక తప్పదు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న క్రికెటర్లకు ఎవరికీ కరోనా లేకపోవడంతో వారికి ఈ క్వారంటైన్తో వచ్చిన నష్టం దాదాపు ఉండకపోవచ్చు.
సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. ఇన్ని సీజన్లలో ఒక్కసారి కూడా రైనా నిరాశపర్చలేదు. 2008 నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడుతున్న రైనా.. మధ్యలో కొచ్చి టస్కర్స్ తరఫున రెండు సీజన్లు ఆడాడు. రైనా సీఎస్కే తరఫున 164 మ్యాచ్లాడి.. అత్యధిక మ్యాచ్లాడిన ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే మొత్తంగా 165 మ్యాచ్లు ఆడగా.. రైనా 164 మ్యాచ్లు ఆడాడు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ను రైనా ఆడలేదు. అదికూడా 2018లో కాలి పిక్క గాయం కారణంగా బరిలోకి దిగలేదు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు కూడా రైనా పేరిటే ఉంది. రైనా 193 మ్యాచ్లు ఆడాడు. రైనా తర్వాత ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్లు ఆడింది ఎంఎస్ ధోనీ. 190 మ్యాచ్లతో ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ (188), దినేశ్ కార్తీక్ (182), విరాట్ కోహ్లీ (177) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.