
హైదరాబాద్: పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికి రోజులు కూడా గడవకముందే మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యాడు. 34 ఏళ్ల వాహబ్ రియాబ్ టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయాన్ని పాకిస్థాన్కు చెందిన దునియా న్యూస్ తన కథనంలో పేర్కొంది.
తన రిటైర్మెంట్ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడని, అధికారిక ప్రకటనే చేయాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వాహబ్ రియాజ్ కెనడా వేదికగా జరుగుతున్న గ్లోబల్ టీ20 లీగ్లో ఆడుతున్నాడు. ఈ లీగ్ ముగిసిన తర్వాత తన రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన చేస్తాడేమో చూడాలి మరి.
ఇదిలా ఉంటే, 27 టెస్టు మ్యాచ్లు ఆడిన రియాజ్ 83 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/63గా ఉంది. చివరగా 2018 అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో దర్శనమిచ్చాడు. ఇక, 27 ఏళ్ల వయసులో మహ్మద్ ఆమీర్ సడన్గా అంతర్జాతీయ టెస్టుకు వీడ్కోలు పలకడం విమర్శలకు తావిచ్చింది.
ఖ్యంగా పాక్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, రమీజ్ రాజా, షోయబ్ అక్తర్లు అతడి రిటైర్మెంట్పై మండిపడ్డారు. అయితే, కోచ్ మికీ ఆర్దర్ మాత్రం ఆమీర్ రిటైర్మెంట్ తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని చెప్పడం విశేషం. మికీ ఆర్థర్ మాట్లాడుతూ "అతడు(ఆమీర్) ఐదేళ్ల పాటు క్రికెట్కు దూరమయ్యాడు. ఈ ఐదేళ్లు అతడు ఏం చేయలేదు. ఈ సమయంలో అతడి శరీరం టెస్టు క్రికెట్కు అనకూలంగా లేదు. అతడు మంచి బౌలర్ కాబట్టి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన సిరిస్లకు మేమే అతడిని ముందుకు నెట్టాం" అని చెప్పుకొచ్చాడు.
"ఆమీర్తో చేయగలిగిన ప్రతిదాన్ని మేము ప్రయత్నించాం. అతడు ఆ ఐదేళ్ళు బాగా మేనేజ్ చేశాడు. దానిని అంగీకరించిన మొదటి వ్యక్తి అతడే. ఆ తర్వాత అతడు తన మొత్తం జీవితంలో ఎక్కడ ఉన్నాడో నాకు అర్థమైంది, కాబట్టి ఇది అతనికి కఠినమైన కాలం. నేను అన్నీ అర్థం చేసుకున్నాను" అని పాక్ కోచ్ మికీ ఆర్థర్ అన్నాడు.
2009, జులైలో గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమీర్ పాక్ తరుపున మొత్తం 36 టెస్టులాడాడు. 17 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన ఆమీర్ 30.47 యావరేజితో మొత్తం 119 వికెట్లు తీశాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆమిర్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఫిక్సింగ్లో దోషిగా తేలడంతో అతడు 2010 నుంచి ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. కొంతకాలం జైలు జీవితాన్ని కూడా గడిపాడు.