హైదరాబాద్: బుధవారం (నవంబర్ 1) టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ 43వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మెన్గా పేరుగాంచిన లక్ష్మణ్ భారత జట్టుకు అనేక అద్భుతమైన విజయాలనందించాడు.
మణికట్టుతోనే చూడచక్కని షాట్లు ఆడే లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్గా ఉన్నారు.
134 టెస్టులాడిన లక్ష్మణ్ 8781 పరుగులు సాధించగా ఒక్క ఆస్ట్రేలియాపైనే 3,173 పరుగులు చేయడం విశేషం. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో లక్ష్మణ్ చేసిన 281 పరుగుల ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ల్లో ఒకటి ఐసీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
అప్పటివరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆసీస్కు లక్ష్మణ్ ఇన్నింగ్స్ అడ్డుకట్ట వేసింది. ఫాలో ఆన్ ఆడుతున్న భారత్కు తన అద్భుతమైన ఇన్నింగ్స్తో చిరస్మరణీయ విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఆస్ట్రేలియన్లకు వీవీఎస్ లక్ష్మణ్ అంటే భయం పట్టుకుంది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చాలు అతడిలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ బయటకి వస్తాడు. 2000-04 మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న లక్ష్మణ్ ఆ ఐదేళ్లలో 60కి పైగా యావరేజితో పరుగులు చేయడం విశేషం. ఎటువంటి వివాదాలు లేని వ్యక్తిగా భారత్ క్రికెట్లో అందరూ గౌరవించే ఆటగాళ్లలో లక్ష్మణ్ ఒకడు.
2012లో ఆడిలైట్లో జరిగిన టెస్టు అనంతరం క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అలాంటి లక్ష్మణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మణ్ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా డాషింగ్ ఓపెనర్ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
'మణికట్టు మాంత్రికుడు భారత శ్రీ లక్ష్మణ్కు జన్మదిన శుభాకాంక్షలు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ మణికట్టు ఫ్లిక్ షాట్లతో మంత్ర ముగ్దుణ్ని చేస్తావ్' అంటూ సెహ్వాగ్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ సాంగ్ చుతియాన్ కలియాన్ను గుర్తుకు తెచ్చుకున్నాడు.