IND vs ENG: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకునేందుకు ఇంగ్లాండ్ నుంచి బయలుదేరడంతో రాబోయే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు సన్నాహాలను భారత్ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షించనున్నారు. గంభీర్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ ఈ బాధ్యతను నిర్వర్తించనున్నారు. టెస్ట్ సిరీస్కు సరిగ్గా ముందు గంభీర్ ఇంగ్లాండ్ను వీడారు. నేషనల్ క్రికెట్ అకాడమీ అధిపతి అయిన లక్ష్మణ్ అండర్-19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ముందే లండన్లో ఉన్నారు.
'రెవ్స్పోర్ట్జ్' నివేదిక ప్రకారం.. గౌతమ్ గంభీర్ తిరిగి వచ్చేవరకు వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా సన్నాహాలను పర్యవేక్షిస్తారు. గతంలో కూడా లక్ష్మణ్ దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో భారత క్రికెట్ జట్టుకు మార్గదర్శకత్వం వహించారు. అయితే గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఇంగ్లాండ్కు తిరిగి వస్తారనేది ఇంకా తెలియదు. కాబట్టి గంభీర్ వచ్చేవరకు అంతా లక్ష్మణ్ పర్యవేక్షణలోనే ఉంటుంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ జూన్ 20న జరగనుంది.

టీమిండియాపై స్పందించిన మైఖేల్ క్లార్క్
ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ కూడా టీమిండియాపై స్పందించారు. భారత జట్టు సురక్షితమైన చేతుల్లో ఉందని.. ఇంగ్లాండ్ను ఓడించడానికి తగినంత ప్రతిభ ఉందని క్లార్క్ అభిప్రాయపడ్డారు. అయితే సిరీస్లో కష్టమైన సమయాల్లో యువ జట్టు ఎలా రాణిస్తుందనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన తర్వాత టీమిండియా ఒక కొత్త శకంలోకి అడుగుపెట్టింది. శుభ్మన్ గిల్ రోహిత్ శర్మకు వారసుడిగా నియమించబడ్డాడు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఈ ఇద్దరు కీలక బ్యాటర్లతో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టులో లేడు. అశ్విన్ ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే రిటైర్ అయ్యారు.