
కోహ్లీ వైఫల్యమే పెద్ద చర్చ:
వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ... 'ఈ పర్యటనలో వన్డే సిరీస్ నుంచి టెస్టు సిరీస్ వరకు చెప్పుకోదగింది ఇద్దరు అతి ముఖ్యమైన ఆటగాళ్ల గురించే. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా వైఫల్యం. టీమిండియా నిరుత్సాహపడటానికి విరాట్ కోహ్లీ బ్యాటింగే ప్రధాన కారణం. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అయిన కోహ్లీ రెండు టెస్టుల్లో సాధించిన సగటు 9.50. టీమిండియాకు ఇది చాలా కఠినంగా ఉంటుందని నేను భావిస్తున్నా. రెండు టెస్టుల్లోనూ ఎలాంటి పోరాటం చూపించలేదు' అని అన్నారు.

అద్భుతంగా బంతులేశాడు:
'తొలి టెస్టులో ఒక్క వికెటే తీసిన బుమ్రా రెండో టెస్టులో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. క్రైస్ట్చర్చ్లో అతడు గాడిలో పడ్డాడు. లైన్ అండ్ లెంగ్త్లో నిలకడగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాట్స్మన్పై ఒత్తిడి తీసుకొచ్చాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచాడు. బుమ్రా ఈ రోజు మరింత అద్భుతంగా బంతులేశాడు' అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

11 ఇన్నింగ్స్లు.. 218 పరుగులు:
రెండు టెస్టుల సిరీస్లో విరాట్ కోహ్లీ కేవలం 38 పరుగులే చేశాడు. అతడి సగటు 9.50 మాత్రమే. కెరీర్లోనే కోహ్లీకి ఇది రెండో అత్యల్ప సగటు. వన్డే, టెస్టు సిరీస్లో విఫలమైన కోహ్లీ.. 11 ఇన్నింగ్స్ల్లో 218 పరుగులే చేసాడు. తొలి వన్డేలో మాత్రమే అర్ధ శతకంతో రాణించాడు. ఇక టెస్టు సిరీస్లోని తొలి మ్యాచ్లో 2, 19 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో మ్యాచ్లో 3, 14 పరుగులు చేశాడు.

సిరీస్ క్లీన్స్వీప్:
హెగ్లే ఓవల్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్పై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను కివీస్ 2-0తో క్లీన్స్వీప్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (52; 74 బంతుల్లో 10x4), టామ్ బ్లండెల్(55; 113 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.


Click it and Unblock the Notifications












