
హైదరాబాద్: ఇటీవల ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో అద్భుత విజయాన్నందుకున్న టీమిండియా చరిత్ర సృష్టించింది. 328 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి రోజు డ్రా చేసుకుంటే గొప్పే అనుకున్న పోరులో నయావాల్ చతేశ్వర్ పుజారా, యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ( 91), యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (89) అద్భుతంగా పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 32 ఏళ్లుగా ఓటమే ఎరుగని గబ్బాలో ఆస్ట్రేలియాను చిత్తుచేసి సిరీస్ను గెలవడం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేనిదే. బ్రిస్బేన్ టెస్ట్లో టీమిండియా గెలిచిన తర్వాత దేశంలోని క్రికెట్ అభిమానులు గర్వంతో ఉప్పొంగిపోయారు.
మరోవైపు బ్రిస్బేన్ టెస్ట్ విజయం కొంతమందిని భావోద్వేగానికి గురి చేసింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. మ్యాచ్ గెలిచిన అనంతరం తాను కంటతడి పెట్టినట్లు తాజాగా లక్ష్మణ్ చెప్పారు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ మాట్లాడుతూ... 'బ్రిస్బేన్ టెస్ట్ విజయం చాలా గొప్పది. నేను కూడా మ్యాచ్ చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాను. చివరి రోజు కుటుంబంతో కలిసి మ్యాచ్ చూశాను. రిషబ్ పంత్, వాషింగ్టన్ వాషింగ్టన్ ఆడుతున్న సమయంలో చాలా ఆందోళనకు గురయ్యాను. మ్యాచ్ గెలవగానే ఏడ్చేశాను' అని తెలిపారు.
'మొదటి నుంచి భారత్ టెస్ట్ సిరీస్ గెలవాలని నేను కోరుకున్నా. అడిలైడ్లో ఏమి జరిగిందో తెలుసు. గబ్బా టెస్ట్ మ్యాచ్కు ముందు అందరూ టీమిండియా గురించే మాట్లాడారు. బ్రిస్బేన్కు వెళ్లడానికి భారత్ భయపడుతోందని, ఎందుకంటే.. అక్కడ ఆస్ట్రేలియా 32 ఏళ్లుగా ఓడిపోలేదన్నారు. కానీ భారత్ బ్రిస్బేన్కు వెళ్లి అద్భుత విజయం సాధించింది. కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాపై గెలవాలన్నది నా కల. ఓ క్రికెటర్గా అది నాకు తీరని కోరికగానే మిగిలిపోయింది. కానీ యువ భారత్ చేసి చూపించడం చాలా గర్వంగా అనిపించింది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి' అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
'క్రికెట్ చూస్తూ నేను కంటతడి పెట్టింది రెండుసార్లే. ఇంతకుముందు 2011 వరల్డ్కప్ గెలిచినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఆ టీమ్లోని ప్రతి ఒక్కరితో కలిసి ఆడాను. వాళ్లంతా తమ కలలను సాకారం చేసుకోవడం చూసి భావోద్వేగానికి లోనయ్యా. మళ్లీ గబ్బాలో భారత్ గెలవగానే కంటతడి పెట్టా' అని హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు. సిడ్నీ టెస్టు అనంతరం కూడా లక్ష్మణ్ ట్వీట్ టీమిండియాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. లక్ష్మణ్ భారత్ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడారు. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన భారత్.. స్వదేశంలో ఇంగ్లండ్ జట్టును ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. చెన్నైలో శుక్రవారం తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.