
రోహిత్ జట్టుకు బలం:
స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. 'కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో సీనియర్ ఆటగాడు అయిన రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరడంపై టీమిండియా ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్లో మరింత అనుభవం కావాలి. రోహిత్ తన ప్రతిభను చూపించాలనుకుంటున్నాడు. అతడి బ్యాటింగ్ స్టైల్కు ఆస్ట్రేలియా పిచ్లు ఎంతో నప్పుతాయి. అతడు కొత్తబంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటే.. భారీ శతకం సాధిస్తాడు. మయాంక్ అగర్వాల్ రెండు టెస్టుల్లో విఫలమవడంతో హిట్మ్యాన్ ఓపెనర్గా బరిలోకి దిగాలి' అని హైదరాబాద్ సొగసరి సూచించాడు.

రోహిత్ శతకంతో రీఎంట్రీ ఇస్తాడు:
దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన రోహిత్ శర్మ శతకంతో రీఎంట్రీ ఇస్తాడు అని వీవీఎస్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సిడ్నీ టెస్టులో అతడు సత్తాచాటుతాడని పేర్కొన్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో రోహిత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐపీఎల్ 2020 ఆడినప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. న్యూజిలాండ్ సిరీస్ అనంతరం హిట్మ్యాన్ బరిలోకి దిగనుండడం ఇదే మొదటిసారి. మయాంక్ అగర్వాల్ పరుగులు చేయడంలో తడబడుతున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. దీంతో అగర్వాల్పై మూడో టెస్టులో వేటు వేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

దేన్ని తక్కువగా అంచనా వేయకూడదు:
'విమర్శలకు టీమిండియా సరైన సమాధానం ఇచ్చింది. 36 పరుగులకే కుప్పకూలడం, కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ దూరమవ్వడంతో.. ఆసీస్ పర్యటనలో భారత జట్టు ఘోరంగా విఫలమవుతుందని విశ్లేషకులు భావించారు. కానీ భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ పుంజుకోవడంలో జట్టు ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది పాత్ర గొప్పది. నా స్నేహితులకు, వీక్షకులకు ఓ విషయం చెబుతున్నా.. దేన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టును' అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

ఆసక్తికరంగా సిరీస్:
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలి.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అనంతరం మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అద్భుతంగా పుంజుకుని కంగారూలపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిడ్నీ వేదికగా గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇరు జట్లు ఒక్కో గేమ్ గెలవడంతో సిరీస్ ఆసక్తికరంగా మారింది.
మూడేళ్ల కిందటే పరిచయం.. బెట్టింగ్ కోసం ఇండియన్ క్రికెటర్తో మాట్లాడిన నర్స్!!


Click it and Unblock the Notifications












