
రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు:
ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో రాహుల్ బ్యాటింగ్ స్థానంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై తాజాగా లక్ష్మణ్ ఓ స్పోర్ట్స్ సమావేశంలో మాట్లాడుతూ... 'రాహుల్ మూడో స్థానంలో బాగా ఆడుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరాడు. దీంతో విండీస్తో సిరీస్లో రాహుల్ ఏ స్థానంలో ఆడతాడనేది స్పష్టంగా చెప్పలేం. రాహుల్ విషయమై జట్టు యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుంటుంది. రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని నేను అనుకుంటున్నా' అని అన్నాడు.

ఓపెనర్గా అవకాశం ఎవరికి:
బంగ్లాదేశ్తో జరిగిన కీలక మూడో టీ20లో రాహుల్ అర్ధ సెంచరీ (52) చేసాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలోనూ పరుగులు చేసాడు. అయితే మరో రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ముస్తక్ అలీ ట్రోఫీలో గాయపడడంతో.. విండీస్తో టీ20 సిరీస్కు అతడి స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ను ఎంపిక చేశారు. రాహుల్, శాంసన్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు. ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి కెప్టెన్ కోహ్లీ ఎవరికి ఓపెనర్గా అవకాశం ఇస్తాడో చూడాలి.

శ్రేయస్ ఆటకు ముగ్ధుడినయ్యా:
బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. శ్రేయస్పై లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఇప్పటి వరకు శ్రేయస్ ఆడిన ఆటకు ముగ్ధుడినయ్యా. మూడో టీ20లో ఆడిన ఇన్నింగ్స్ ఉత్తమంగా సాగింది. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో బాగా ఆడాడు. శ్రేయస్కు పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం వచ్చింది' అని లక్ష్మణ్ అన్నాడు.

అలాంటి ఆటే కావాలి:
'రాహుల్ ఔటయ్యాక రిషభ్ పంత్ స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలం అయ్యాడు. శ్రేయస్ మాత్రం పరిస్థితులకు తగ్గట్లు ఆడాడు. కీలక సమయంలో గేర్ మార్చి రెచ్చిపోయాడు. విలువైన పరుగులు చేసాడు. నాలుగో స్థానంలో అలాంటి ఆటే ఇప్పుడు మనకు కావాల్సింది' అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 6న రాత్రి 7 గంటలకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.


Click it and Unblock the Notifications












