
మెరుగవ్వడానికి ఇంకా ప్రయత్నిస్తున్నా
తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ 'ఇండియా టుడే ఇన్స్పిరేషన్' ఇంటర్వ్యూలో బోరియా మజుందార్తో మాట్లాడుతూ... 'హిందీలో మెరుగవ్వడానికి ఇంకా ప్రయత్నిస్తున్నా. హిందీ వ్యాఖ్యాతగా మారడానికి ఎంతో కష్టపడ్డా. పని ఏదైనా దానిపై ఇష్టం పెంచుకోవాలి, అలా అయితేనే ముందుకువెళ్ళగలం. ఇప్పుడు నేను కామెంటరీని ప్రేమిస్తున్నా. ఇంకా క్రికెట్లోనే భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చిన స్టార్స్పోర్ట్స్కు ధన్యవాదాలు. స్టార్స్పోర్ట్స్ సంజోగ్తో నాకు పరిచయం ఉంది. వీక్షకులకు హిందీ భాష ఎంత కీలకమో నాకు అతను వివరించాడు' అని చెప్పారు.

రెండే మార్గాలు కనిపించాయి
'హైదరాబాద్లో పెరిగిన నేను హిందీలో మాట్లాడగలను. కానీ.. హైదరాబాద్ హిందీ, కామెంటరీలో చెప్పే హిందీ వేరుగా ఉంటుంది. కామెంటరీ హిందీ నాకు కష్టంగా అనిపించింది. క్రికెట్కు వీడ్కోలు పలికిన నాకు రెండే మార్గాలు కనిపించాయి. ఒకటి కామెంటరీ వదులుకోవాలి. రెండోది కష్టపడి హిందీ నేర్చుకోవాలి. హిందీ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే హిందీలో అయితే ఎంతో మంది యువకులకు నా జ్ఞానాన్ని, ఆలోచనలను పంచుకోవచ్చు' అని లక్ష్మణ్ తెలిపారు.

పిల్లలతో ట్యూషన్కు వెళ్లా
'హిందీ నేర్చుకోవడం కోసం ఎంతో శ్రమించా. మా పిల్లలు హిందీ ట్యూషన్కు వెళ్తుంటే వారితో కలిసి వెళ్లి నేర్చుకున్నా. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. కానీ.. ఇదే నిజం. ఆరో స్థానంలో బ్యాటింగ్లో నాకు పెద్దగా అనుభవం లేదు. కానీ.. జట్టు కోసం ఆడాల్సి వచ్చినప్పుడు ఓ సవాలుగా తీసుకున్నా. దాని కోసం శ్రమించా. ఆ స్థానంలో విజయవంతంగా బ్యాటింగ్ చేశాను. ఇప్పుడు ఇలానే సవాలుగా తీసుకుని శ్రమించా' అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

2012లో రిటైర్మెంట్
వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాకు ఎన్నో అపూర్వ విజయాలు అందించారు. మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలతో కలిసి ఆడారు. 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో లక్ష్మణ్-ద్రవిడ్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. పీకల్లోతు కష్టాల్లో ఫాలోఆన్ ఆడుతున్న జట్టును వీరిద్దరూ కలిసి ఏకంగా 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్కు చారిత్రక విజయాన్ని అందించారు. లక్ష్మణ్ భారత్ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. 2012లో క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications












